కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూత
ఆనారోగ్య సమస్యల కారణంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ కల్మాడి కన్నుమూశారు. ఆయన వయస్సు 81ఏళ్లు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ కల్మాడి ఇకలేరు. 81 ఏళ్ల వయస్సులో దీర్ఘకాల అనారోగ్యంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

మహారాష్ట్ర పుణెలోని దీననాథ్ మంగేశ్కర్ ఆసుపత్రిలో ఆయన గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు.
పుణెలోని ఎరందవనేలో ఉన్న కల్మాడీ నివాసంలో మధ్యాహ్నం 2 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు వైకుంఠ్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సురేశ్ కల్మాడి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కల్మాడికి భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుడు, మనవళ్లు ఉన్నారు.
రాజకీయ ప్రస్థానం.. క్రీడా రంగంలో చెరగని ముద్ర..
సురేశ్ కల్మాడి పుణె నగరం నుంచి పలుమార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసి, జాతీయ స్థాయిలో క్రీడా పరిపాలనలో కీలక పాత్ర పోషించారు.
పుణె నగరాన్ని క్రీడా హబ్గా మార్చడంలో ఆయన కృషి మరువలేనిది.
సురేశ్ కల్మాడి- వివాదాలు, ఒడిదుడుకులు..
2010లో భారత్ నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) కల్మాడీ కెరీర్లో ఒక పెద్ద మలుపుగా నిలిచింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. 2011 ఏప్రిల్లో ఆయన అరెస్టయ్యారు, ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.
వివాదాల తర్వాత కూడా క్రీడా సంస్థల్లో ఆయన పట్టు తగ్గలేదు. 2016లో ఐఓఏ ఆయనను లైఫ్ ప్రెసిడెంట్గా ఎంపిక చేసినా, ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావడంతో ఆ పదవిని ఆయన సున్నితంగా తిరస్కరించారు.
"ఈ పదవిని చేపట్టడానికి ఇది సరైన సమయం కాదు," అని పేర్కొంటూ ఆయన తప్పుకున్నారు.
15 ఏళ్ల తర్వాత లభించిన క్లీన్ చిట్..
దాదాపు 15 ఏళ్ల పాటు సాగిన కామన్వెల్త్ గేమ్స్ అవినీతి కేసులో కల్మాడికి గతేడాది పెద్ద ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను దిల్లీ కోర్టు ఆమోదించింది. ఆయనపై మనీ లాండరింగ్కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేస్తూ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.
సురేశ్ కల్మాడి మరణం పట్ల పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


