3ఏళ్లల్లో 25శాతం కన్నా ఎక్కువ రిటర్నులు ఇచ్చిన మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి..
గత మూడేళ్లలో అత్యుత్తమ వార్షిక రాబడి (25% పైగా) ఇచ్చిన ఆరు మిడ్క్యాప్ స్కీమ్ల జాబితాను ఇక్కడ చూసేయండి. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ అత్యధిక రాబడి నమోదు చేసింది. ఈ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలను కూడా ఇక్కడ తెలుసుకోండి..

మీరు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? గత కొంతకాలంగా అత్యద్భుతమైన రాబడిని అందించిన ఫండ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే మీ కోసమే ఈ ప్రత్యేక సమాచారం! గత మూడేళ్లలో 25శాతం కంటే ఎక్కువ వార్షిక రాబడిని అందించిన ఆరు అగ్రశ్రేణి మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు అంటే ఏమిటి?
సెబీ మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణ ప్రకారం.. తమ పెట్టుబడుల్లో కనీసం 65 శాతం నిధులను మిడ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టే ఫండ్స్ని మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు.
మరి మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి? మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) ఆధారంగా దేశంలోని లిస్టెడ్ కంపెనీలకు ర్యాంకింగ్ ఇస్తారు. ఈ ర్యాంకింగ్లో 101 నుంచి 250 మధ్య స్థానంలో ఉండే కంపెనీల సెక్యూరిటీలనే మిడ్ క్యాప్ స్టాక్స్ అని అంటారు. ఈ ఫండ్స్లో రిస్క్ అనేది.. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువగా, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా తక్కువగా ఉంటుంది. రివార్డు కూడా అంతే!
టాప్ 6 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ (గత 3 ఏళ్లలో 25% పైగా రాబడి):
గత మూడేళ్ల కాలంలో 25 శాతం కంటే ఎక్కువ వార్షిక రిటర్నులు అందించిన ఆరు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ని ఇక్కడ చూడండి..
| మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ | 3ఏళ్ల రిటర్నులు(%) |
|---|---|
| ఎడెల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్ | 25.14 |
| హెచ్డీఎఫ్సీ మిడ్ క్యాప్ ఫండ్ | 26.63 |
| ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ | 28.46 |
| మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ | 26.17 |
| నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ | 25.72 |
| వైట్ ఓక్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్ | 25.28 |
(సోర్స్: ఆంఫీ; 23 అక్టోబర్ 2025 నాటి డేటా)
పైన పేర్కొన్న పట్టిక ప్రకారం.. ఎడెల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్ 25 శాతం కంటే కొద్దిగా ఎక్కువ వార్షిక రాబడిని ఇవ్వగా, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ అత్యధికంగా 28.46% వార్షిక రాబడిని అందించింది. ఇతర మిడ్ క్యాప్ ఫండ్లు కూడా 25% కంటే ఎక్కువ రాబడిని నమోదు చేశాయి.
పెట్టుబడి సలహా, రిస్క్ అంశాలు..
మిడ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలను గుర్తుంచుకోవాలని దిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, వెల్త్ అడ్వైజర్ దీపక్ అగర్వాల్ సలహా ఇచ్చారు.
“మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్లు స్మాల్ క్యాప్ ఫండ్ల కంటే సురక్షితమైనవిగా, అదే సమయంలో లార్జ్ క్యాప్ ఫండ్ల కంటే రిస్క్తో కూడుకున్నవిగా ఉంటాయి. అయితే, కొన్ని మిడ్ క్యాప్ కంపెనీలు భవిష్యత్తులో లార్జ్ క్యాప్ కంపెనీలుగా మారే అవకాశం ఉంటుందని మదుపరులు గమనించాలి. మిడ్ క్యాప్ ఫండ్లు కొంత అస్థిరతను కలిగి ఉంటాయి కాబట్టి, మీ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని వీటికి కేటాయించడం మంచిది, కానీ అతిగా పెట్టుబడి పెట్టకూడదు,” అని ఆయన సూచించారు.
ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని తప్పక ప్రస్తావించాలి. ఏదైనా ఒక స్కీమ్ గతంలో మంచి రాబడిని ఇచ్చింది అంటే, భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని ఎలాంటి హామీ ఉండదు! కాబట్టి, గత పనితీరును మాత్రమే చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోకూడదు. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


