తమిళనాడు మద్యం దుకాణాల్లో కొత్త విధానం: సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ ఆర్డర్లు, ఓటీపీ తప్పనిసరి

తమిళనాడులోని టాస్మాక్ మద్యం దుకాణాల నిర్వహణలో సెప్టెంబర్ 1 నుంచి కీలక మార్పులు రానున్నాయి. చేతిలో ఇమిడే హ్యాండ్ హెల్డ్ పరికరాలు, ఓటీపీ ప్రామాణీకరణ ఆధారంగా మద్యం స్టాక్ ఆర్డర్లను నమోదు చేసే డిజిటల్ విధానాన్ని తీసుకువస్తున్నారు.

Published on: Aug 28, 2026, 10:18:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళనాడులో మద్యం విక్రయాలు చేపట్టే ప్రభుత్వ సంస్థ 'టాస్మాక్' (TASMAC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రీటైల్ మద్యం దుకాణాల స్టాక్ ఇండెంట్ (ఆర్డర్) ప్రక్రియను సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నట్లు ప్రకటించింది. పాత కాగితాల పద్ధతికి స్వస్తి పలికి, డిజిటల్ విధానం ద్వారా పరిమితులకు లోబడి ఆర్డర్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు.

మద్యం దుకాణాల్లో కొత్త విధానం: సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ ఆర్డర్లు, ఓటీపీ కూడా
మద్యం దుకాణాల్లో కొత్త విధానం: సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ ఆర్డర్లు, ఓటీపీ కూడా

హ్యాండ్ హెల్డ్ డివైజ్లతో స్టాక్ నమోదు

కొత్త విధానంలో భాగంగా షాపు సూపర్వైజర్లు తమ వద్ద ఉండే ప్రత్యేక హ్యాండ్ హెల్డ్ పరికరాల ద్వారానే స్టాక్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. "స్థానిక అమ్మకాలు, డిమాండ్‌కు అనుగుణంగా వినియోగదారులకు కావలసిన బ్రాండ్లను నిరంతరాయంగా అందించడానికే ఈ మార్పులు చేశాం" అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ కే నందకుమార్ ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. 2025 నాటికి రాష్ట్రంలోని 38 జిల్లాల పరిధిలోని డిపోలలో పూర్తిస్థాయి కంప్యూటరీకరణ సాధించిన అనంతరం, మద్యం సరఫరా వ్యవస్థలో అవాంతరాలను తొలగించేందుకు ఈ తదుపరి నిర్ణయం తీసుకున్నారు.

స్థానిక డిమాండ్‌కు ప్రాధాన్యం.. ఓటీపీ భద్రత

హ్యాండ్ హెల్డ్ పరికరంలో ప్రతి దుకాణానికి కేటాయించిన ప్రాథమిక స్టాక్ పరిమాణం స్వయంచాలకంగా కనిపిస్తుంది. సిస్టమ్ నిర్ణయించిన బేస్ పరిమాణాన్ని తగ్గించే వెసులుబాటు సూపర్వైజర్లకు ఉండదు. అయితే స్థానిక డిమాండ్‌ను బట్టి నిర్దేశిత ఆర్డర్‌ను 20 శాతం వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. జాబితాలో లేని ఇతర రిజిస్టర్డ్ బ్రాండ్లను కూడా స్థానిక కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు ఆర్డర్‌లో చేర్చవచ్చు.

పారదర్శకత పెంచేందుకు జిల్లా మేనేజర్ కార్యాలయాల్లో నేరుగా ఇచ్చే కాగితపు పత్రాలను రద్దు చేశారు. సూపర్వైజర్ తన నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) నమోదు చేస్తేనే ఆర్డర్ దాఖలవుతుంది.

ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్

డిజిటల్ విధానంలో ఖరారైన ఇండెంట్ నేరుగా స్థానిక డిపోలకు చేరుతుంది. నమోదు చేసిన వివరాలకు పూర్తి బాధ్యత షాపు సూపర్వైజర్లదేనని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1న అధికారికంగా ప్రారంభించడానికి ముందు, సాంకేతిక పనితీరును పరిశీలించేందుకు జిల్లా మేనేజర్లు సంతకం చేసిన ప్రింటెడ్ ప్రతులతో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More