Earthquake today : వరుస భూకంపాలు- వెనెజువెలాలో 7.5, 7.1 తీవ్రతతో రెండు! కూలిన భవనాలు.. జపాన్​లో 6.9

Venezuela earthquake : వెనెజువెలాలో బుధవారం సాయంత్రం వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 7.1, 7.5గా నమోదైంది. రాజధాని కారకాస్‌లో పలు భవనాలు కుప్పకూలాయి. మరోవైపు జపాన్ ఈశాన్య తీరంలోనూ 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Published on: Jun 25, 2026, 05:47:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వెనెజువెలా దేశాన్ని బుధవారం సాయంత్రం వరుస భూకంపాలు అతలాకుతలం చేశాయి! కొద్ది నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాల వల్ల రాజధాని కారకాస్​తో పాటు ఆ దేశంలోని పలు నగరాలు తీవ్రంగా వణికిపోయాయి. మరీ ముఖ్యంగా భూ ప్రకంపనల ధాటికి కారకాస్ నగరంలో పలు భవనాలు, నివాస గృహాలు కుప్పకూలాయి.

భూకంపం ధాటికి వెనెజువెలాలో కూలిన భవనం.. (AP Photo/Adrian Naranjo)
భూకంపం ధాటికి వెనెజువెలాలో కూలిన భవనం.. (AP Photo/Adrian Naranjo)

అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (యూఎస్​జీఎస్) నివేదిక ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం మొదట 7.1 తీవ్రతతో తొలి భూకంపం సంభవించింది. దీని కేంద్రం కారకాస్ నగరానికి పశ్చిమంగా 168 కిలోమీటర్ల (104 మైళ్లు) దూరంలో ఉన్న తీరప్రాంతం ‘మొరోన్’కు పశ్చిమ భాగంలో, భూమికి 13 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ఈ ప్రకంపనలు వచ్చిన కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే అంతకంటే శక్తివంతమైన 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం మొరోన్ నగరానికి నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది.

గత శతాబ్ద కాలంలో వెనెజువెలాలో సంభవించిన అత్యంత బలమైన భూకంపాల్లో ఇవి కూడా ఒకటి కావడం గమనార్హం.

ఈ భారీ భూకంపాల నేపథ్యంలో అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం 'వర్జిన్ ఐలాండ్స్'కు సునామీ అలర్ట్ జారీ చేసింది. డొమినికన్ రిపబ్లిక్ అధికారులు కూడా తమ దీవులకు హెచ్చరికలు పంపారు. అయితే, ప్యూర్టో రికోకు జారీ చేసిన సునామీ హెచ్చరికను అధికారులు కొద్దిసేపటికే ఉపసంహరించుకున్నారు.

కారకాస్ నగరంలో భవనాలు ఇరువైపులా ఊగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. అనేక చోట్ల భవనాల గోడలు పూర్తిగా కూలిపోవడంతో ఇళ్లలోని ఫర్నిచర్ బయటకు కనిపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా దుమ్ము ధూళి మేఘాలు కమ్మేశాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ భూకంప ప్రభావం భారీగా కనిపించిందని వెనెజువెలా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో తెలిపారు. ముఖ్యంగా కారకాస్‌లోని అల్టామిరా ప్రాంతంలో ఇళ్లు, భవనాలు కూలిపోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని ఆయన వాహనదారులను కోరారు. సహాయక చర్యల ప్రోటోకాల్స్ యాక్టివేట్ చేశామని, అందరూ అప్రమత్తంగా ఉండాలని టీవీ ద్వారా పిలుపునిచ్చారు.

జపాన్ ఈశాన్య తీరంలో 6.9 తీవ్రతతో భూకంపం..

ఇదిలావుండగా, ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే జపాన్ దేశంలోనూ గురువారం భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని తోహోకు తీరంలో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.

ఈ భూకంప కేంద్రం ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో భూమికి దాదాపు 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. సముద్ర మట్టంలో స్వల్ప మార్పులు మినహా దీనివల్ల ఎలాంటి సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, అమోరి ప్రిఫెక్చర్‌లో భూకంప తీవ్రత జపాన్ స్కేలు ప్రకారం 6-ప్లస్‌గా నమోదైంది. ఈ స్థాయిలో ప్రకంపనలు వస్తే మనుషులు కనీసం నిలబడలేరు, పాకడం మినహా కదలడం కూడా సాధ్యం కాదు!

భూకంపం నేపథ్యంలో తోహోకు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ స్పందిస్తూ.. తమ ఒనాగావా, హిగాషిదోరి అణు విద్యుత్ ప్లాంట్లలో ఎలాంటి అసాధారణ పరిస్థితులు నమోదు కాలేదని, అంతా సురక్షితంగానే ఉందని తెలిపింది.

అయితే ఈస్టర్న్ రైల్వేస్ ముందుజాగ్రత్త చర్యగా తోహోకు షింకన్‌సేన్ బుల్లెట్ రైలు సర్వీసులతో పాటు పలు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More