ఇరాన్పై అమెరికా క్షిపణి దాడులు: హెలికాప్టర్ కూల్చివేతకు ట్రంప్ ప్రతీకారం
హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అత్యాధునిక అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీనికి ప్రతీకారంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులకు దిగింది.
అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అమెరికా సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేయడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణమే ప్రతీకార దాడులకు ఆదేశించారు. ఈ మేరకు ఇరాన్లోని హోర్మోజ్గాన్ ప్రాంతంలో ఉన్న సిరిక్, మినాబ్, బందర్ అబ్బాస్ నగరాలపై అమెరికా బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి.

వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో (ఈస్టర్న్ టైమ్) ఈ దాడులను ప్రారంభించింది.
"ఈ మిషన్ ఇరాన్ అనాలోచిత దురాక్రమణకు లభించిన తగిన సమాధానం" అని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థలు ఫార్స్, మెహర్ తెలిపిన వివరాల ప్రకారం.. హార్ముజ్ ప్రాంతంలోని కోహెస్తాక్, సిరిక్, మినాబ్, తీరప్రాంత నగరమైన బందర్ అబ్బాస్లలో భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ పేలుళ్లు జరిగిన ఖచ్చితమైన స్థావరాల వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.
అపాచీ కూల్చివేతతో పెరిగిన ఉద్రిక్తత
హార్ముజ్ జలసంధిలో నిఘా పెడుతున్న అమెరికా ఆర్మీకి చెందిన ఏహెచ్-64 అపాచీ (AH-64 Apache) హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేయడమే ఈ తాజా ఘర్షణకు కారణం.
"ఇరాన్ సైన్యం మా అత్యాధునిక అపాచీ హెలికాప్టర్ను టార్గెట్ చేసి కూల్చివేసింది" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరాన్కు చెందిన ఒక వన్-వే అటాక్ డ్రోన్ ఈ హెలికాప్టర్ను ఢీకొట్టి కూల్చేసిందని అమెరికా రక్షణ శాఖ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా, హెలికాప్టర్లోని ఇద్దరు సిబ్బందిని ఒక సీ-డ్రోన్ (సముద్ర డ్రోన్) సహాయంతో సురక్షితంగా రక్షించారు. రక్షణ రంగ చరిత్రలోనే ఇలా సీ-డ్రోన్ ద్వారా సైనికులను కాపాడటం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఆ ఇద్దరు సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు మిలిటరీ వర్గాలు తెలిపాయి.
ఇరాన్ సంజాయిషీ.. హెచ్చరికలు
ఈ ఘటనపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. తమ భూభాగానికి దగ్గరగా విదేశీ శక్తులు సంచరించడం వల్లే ఇలాంటివి జరుగుతాయని ఇరాన్ అంటోంది.
"అమెరికా తీరానికి వేల మైళ్ల దూరంలో ఉన్న హార్ముజ్ జలసంధిలోకి విదేశీ సైన్యం రావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలను నివారించాలంటే విదేశీ బలగాలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లడమే ఏకైక మార్గం" అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.
మరోవైపు, తాము ఉద్దేశపూర్వకంగా అపాచీ హెలికాప్టర్ను లక్ష్యంగా చేసుకోలేదని, అది కేవలం ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాదీ అల్ జజీరా ఛానెల్తో వ్యాఖ్యానించారు.
గత రెండు నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందానికి ఈ తాజా దాడులు గండి కొట్టాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరస్పర దాడులు జరిగిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో పశ్చిమాసియాలో యుద్ధ భయాలు తీవ్రమయ్యాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


