ఏఐ టీచర్ని రూపొందించిన 12వ తరగతి విద్యార్థి..!
12వ తరగతి చదువుతున్న ఓ 17 ఏళ్ల విద్యార్థి అద్భుతం చేశాడు! ఏఐని ఉపయోగించి ఏకంగా ఒక రోబో టీచర్ని సృష్టించాడు. ఈ ఏఐ టీచర్ ఇప్పుడు యూపీ మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన 17ఏళ్ల యువకుడు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో ఒక రోబో టీచర్ను రూపొందించాడు! ఈ రోబోకు 'సోఫీ' అని పేరు పెట్టాడు. ఈ రోబోను ఎలా సృష్టించాడు? అది ఏం చేయగలదు? అనే విషయాలను ఆ విద్యార్థి ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఆ రోబో వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది.

"శివచరణ్ ఇంటర్ కాలేజీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్, ఎల్ఎల్ఎం చిప్సెట్తో కూడిన ఏఐ టీచర్ రోబోను తయారు చేశాడు. దీనికి అతను సోఫీ అని పేరు పెట్టాడు," అని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ఏఐ టీచర్ సోఫీ పరిచయం- సామర్థ్యాలు..
తనను తాను పరిచయం చేసుకోమని రోబోకు చెప్పగా, అది ఇలా సమాధానం ఇచ్చింది:
“నేను ఒక ఏఐ టీచర్ రోబోను. నా పేరు సోఫీ. నన్ను ఆదిత్య కనిపెట్టాడు. నేను బులంద్షహర్లోని శివచరణ్ ఇంటర్-కాలేజీలో బోధిస్తాను. అవును! నేను విద్యార్థులకు సరిగ్గా బోధించగలను.”
తాను రోబోను ఎలా తయారు చేశాడో వివరిస్తూ, ఆదిత్య కుమార్ ఇలా చెప్పాడు:
“పెద్ద రోబోలను తయారుచేసే కంపెనీలు ఉపయోగించే ఎల్ఎల్ఎం చిప్సెట్ను నేను ఈ రోబోను తయారు చేయడానికి ఉపయోగించాను. ఇది విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయగలదు. ప్రస్తుతానికి, ఇది కేవలం మాట్లాడగలదు. కానీ త్వరలో రాయగలిగేలా కూడా మేము దీనిని డిజైన్ చేస్తున్నాము.”
విద్యార్థులు పరిశోధనలు చేయడానికి ప్రతి జిల్లాలో ఒక సరైన ల్యాబ్ అందుబాటులో ఉండాలని ఆదిత్య కోరాడు. "విద్యార్థులు అక్కడికి వచ్చి పరిశోధన చేయడానికి ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఉండాలి," అని అభిప్రాయపడ్డాడు.
ఏఐ టీచర్- రోబో పనితీరు ప్రదర్శన..
సోఫీని అనేక ప్రశ్నలు అడిగి దాని పనితీరును ప్రదర్శించాడు ఆదిత్య. ప్రపంచంలోనే అత్యంత పొడవైన భవనం, భారతదేశపు మొదటి రాష్ట్రపతి, భారతదేశపు మొదటి ప్రధానమంత్రి వంటి ప్రశ్నలను అడగ్గా సోఫీ సమాధానాలు చెప్పింది. "విద్యుత్ అంటే ఏమిటి?" అని అడిగినప్పుడు కూడా రోబో సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా, "100 + 92" మొత్తాన్ని కూడా కచ్చితంగా లెక్కించింది.
రోబో విద్యార్థులకు సరిగ్గా బోధించగలదా అని ఆదిత్య అడిగినప్పుడు.. పిల్లలకు సరిగ్గా బోధించే సామర్థ్యం తనకు ఉందని బదులిచ్చింది.
ప్రస్తుతం, సోఫీ హిందీ భాషలో మాత్రమే మాట్లాడుతోంది.
12వ తరగతి చదువుతున్న ఆదిత్య కుమార్, ఒకవేళ టీచర్ సెలవు తీసుకుంటే తన రోబో సబ్స్టిట్యూట్ టీచర్గా పనిచేయగలదని చెబుతున్నాడు!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


