'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' అప్డేట్ - ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం...!
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు.
అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కూపన్ల ఆధారంగా అందిస్తామని కూడా చెప్పింది. అయితే తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పనులు జరుగుతున్నాయి. నిర్మాణ స్థాయిని బట్టి నిధులను కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేయడం జరిగిందని చెప్పారు. 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి… వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్దిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోని జమ చేస్తున్నామని వివరించారు. బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1లక్ష25 వేలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1లక్ష75 వేలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందిరమ్మ ఇంటి నమూనా
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ (జిహెచ్ఎంసి) మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకు గాను 88 నియోజకవర్గాలలో లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వర్షాకాలం సీజన్ ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగైన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
(HT Telugu)
ఇండ్ల మంజూరు,గ్రౌండింగ్ లో సూర్యాపేట, పెద్దపల్లి,భూపాలపల్లి,హనుమకొండ,వికారాబాద్, సిద్దిపేట,నారాయణపేట,జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని మంత్రి పొంగులేటి చెప్పారు. తక్షణమే ఆయా జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
E-Paper

