కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేశారా..? ఇవాళ్టి నుంచే పంపిణీ ప్రారంభం, మీ వివరాలు ఇలా చెక్ చేసుకోండి
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులు… లబ్ధిదారులకు అందజేయనున్నారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నూతన రేషన్ కార్డుల పంపిణీకి ఇవాళ్టి(జూలై) నుంచి శ్రీకారం చుట్టనుంది. ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలోని తిరుమలగిరి లో సీఎం రేవంత్రెడ్డి రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొంత మంది లబ్ధిదారులకు కార్డులను అందజేస్తారు. దీంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలవారీగా కొత్త కార్డులను పంపిణీ చేస్తారు. ఆయా లబ్ధిదారులు కొత్త కార్డులను పొందవచ్చు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రజా ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుందని ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే కార్డులను సిద్ధం చేశారు.
రేషన్ కార్డు దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అంటే లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం సంబంధింత వెబ్ సైట్లోని హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై నొక్కాలి. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి. ఈ లిస్ట్ లో పేర్లు ఉంటే… కొత్త కార్డును పంపిణీ చేస్తారు. వివరాలు అందుబాటులో లేకపోతే… వేచి చూడాల్సి ఉంటుంది.
బీపీఎల్( దారిద్య్ర రేఖకు దిగువ) కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డును అందజేస్తారు. ఏపీఎల్ కుటుంబాలకు పచ్చ కార్డును పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీఎం చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఇవాళ అధికారికంగా ప్రారంభమవుతుండగా… అన్ని జిల్లాల్లోనూ కొత్త రేషన్ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్లో 31,772 కొత్త కార్డులను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త రేషన్ కార్డుల జారీ, పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.1150.68 కోట్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
E-Paper

