కొత్తగా రేషన్ కార్డు వచ్చిందా...? 'గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్'కు ఇలా అప్లయ్ చేసుకోండి
తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. జిల్లాల్లోని నియోజకవర్గాలు, మండలాల వారీగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్లు గ్యాస్ సబ్సిడీ (మహాలక్ష్మీ) స్కీమ్ కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి
ఈ స్కీమ్ అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుదారుల వివరాలను అన్ని కోణాల్లో పరిశీలించింది. అయితే ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవాలంటే తెల్లరేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకుంది. దీని ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేశారు.
ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్లు ఈ స్కీమ్ అమలు కోసం స్థానిక అధికారులను సంప్రదించవచ్చు. మండల కార్యాలయాల్లోని ఎంపీడీవో ఆఫీసులను సంప్రదించాల్సి ఉంటుంది. అదే నగరాలు, పట్టణాల్లో అయితే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలి. మీ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్ పత్రాలను సమర్పించాలి. అయితే ప్రజాపాలనలో దరఖాస్తు నెంబర్ కూడా కలిగి ఉండాలి.
రాయితీపై గ్యాస్ సిలిండర్ పథకానికి ప్రధానంగా ప్రభుత్వం కొన్ని అర్హతలను కూడా నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ గ్యాస్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెలంగాణలో తెల్లరేషన్ కార్డు దారులై ఉండాలి. వినియోగంలో ఉన్న ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ ఉండాలని స్పష్టం చేసింది. వినియోగదారులు గత మూడేళ్ల సిలిండర్ వినియోగాన్ని సగటు ఆధారంగా… ఆ కుటుంబానికి సబ్సిడీ వర్తింపజేస్తారు. అంటే ఒక కుటుంబం ఏడాదికి వినియోగించే సిలిండర్ల సగటు 3 అయితే మూడు సిలిండర్లకే సబ్సిడీ ఇస్తారు. అంతే కానీ ఎన్ని సిలిండర్లు తీసుకుంటే అన్నింటికీ సబ్సిడీ అందదని ప్రభుత్వం తెలిపింది.
ప్రజాపాలన సమయంలో రేషన్ కార్డు లేనివాళ్లు ఈ స్కీమ్ కోసం అర్హులుగా ఎంపిక కాలేదు. అయినప్పటికీ ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ లో ఈ స్కీమ్ కోసం టిక్ చేసుకున్నారు. రేషన్ కార్డు లేకపోవటంతో చాలా మంది ఈ స్కీమ్ కు దూరమయ్యారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కార్డులను మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతోంది. కొత్త కార్డు వచ్చిన వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా సబ్సిడీ ద్వారా గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.
ప్రజాపాలనలో భాగంగా మొత్తం మహాలక్ష్మీ పథకానికి 92.23లక్షల దరఖాస్తులు అందాయి,
వీటిల్లో సబ్సిడీ సిలిండర్ స్కీమ్ కోసం 39 లక్షలకుపైగా అర్హులుగా గుర్తించింది. ఈ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ చేపట్టిన సంగతి తెలిసిందే. సబ్సిడీ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో ఒకటిగా మహాలక్ష్మీ ఉంది. ఈ స్కీమ్ లో భాగంగా రూ. 500కే గ్యాస్ అందిస్తామని ప్రకటించింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ స్కీమ్ ను గతేడాది ఫిబ్రవరి 27వ తేదీన చేవేళ్లలో ప్రారంభించింది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూలై 14వ తేదీ నుంచి లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్లు… తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యాస్ సబ్సిడీ (మహాలక్ష్మీ) స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.
గృహ వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. కొత్తగా కార్డు వచ్చిన వాళ్లు… స్థానికంగా ఉండే అధికారులను కలిసి ఈ స్కీమ్ కు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కొత్త దరఖాస్తులకు అవకాశం లేకపోతే… ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్ చేసుకునే వీలు ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్ కు సంబంధించిన అర్హతలు ఉన్న వారు ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు.
E-Paper

