కొత్త రేషన్ కార్డుల పంపిణీ : లబ్ధిదారులు ఆరోగ్య శ్రీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చా..? ఇవిగో వివరాలు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. కార్డులు తీసుకుంటున్న లబ్ధిదారులు.. పలు స్కీమ్ లకు దరఖాస్తు చేసుకునే పనిలో పడుతున్నారు. అయితే రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డుపై ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి….
కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారు రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఆరోగ్య శ్రీ కార్డు మంజూరుకు రేషన్ కార్డునే ప్రతిపాదికగా తీసుకున్నారు. అప్పుడు రూ. 5 లక్షల పరిమితి మాత్రమే ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలోని రేవంత్ సర్కార్… ఈ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. అంతేకాదు మరికొన్ని వైద్య సేవలను కూడా ఇందులో చేర్చింది. దీంతో ఈ కార్డు కోసం కొత్త రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ సంఖ్యలో రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జూలై 13 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి అప్రూవ్ చేయనున్నారు. సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
ఇందులో భాగంగా జూలై 14 నుంచి కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించింది.
ఆరోగ్య శ్రీ స్కీమ్ లో పలు మార్పులు తీసుకురావాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి గతంలో ఉన్న రూ.5 లక్షల పరిమితిని ప్రస్తుతం రూ.10 లక్షలకు కూడా పెంచింది. దీంతో పాటు ఈ పథకంలో అదనంగా 163 వైద్య చికిత్సలను కూడా జత చేసింది. మొత్తం మీద ఈ పథకం ద్వారా 1,835 చికిత్సలకు అవకాశం కల్పించింది.
పలుమార్లు వైద్యారోగ్య శాఖపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి…. ఆరోగ్య శ్రీ కార్డుకు రేషన్ కార్డుతో జత పెట్టకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే కార్డును ఇవ్వాలని నిర్ణయించారు. రేషన్ కార్డుతో లింకు పెట్టొద్దని చెప్పటంతో పాటు… రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డును అందించే దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది.
గతం నుంచి నేటి వరకు కూడా రేషన్ కార్డులకు తెగ డిమాండ్ ఉంటున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. ప్రతి స్కీమ్ కు ఈ కార్డును దాదాపుగా ప్రతిపాదికగా తీసుకుంటారు. కాబట్టి ఈ కార్డుతో అనేక అంశాలు ముడిపడి ఉండటంతో… ప్రతి పౌరుడు కూడా ఈ కార్డు పొందాలని భావిస్తుంటారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. కార్డులు తీసుకుంటున్న లబ్ధిదారులు.. పలు స్కీమ్ లకు దరఖాస్తు చేసుకునే పనిలో పడుతున్నారు. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ స్కీమ్ వంటి వాటికి అప్లికేషన్ చేసుకుంటున్నారు.
డిజిటల్ హెల్త్ కార్డులో భాగంగా… ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. బార్ కోడ్ కూడా ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులివ్వడానికి సుమారు రూ.180 కోట్లు అవసరమని ఆరోగ్యశాఖ ఇప్పటికే అంచనా కూడా వేసింది. త్వరలోనే వీటిని పంపిణీ చేస్తారు. అయితే ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారు… ప్రత్యేకంగా అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ హెల్త్ కార్డు కోసం ప్రభుత్వం సేకరించే సమాచారం ఆధారంగానే…. కార్డును మంజూరు చేస్తారు. ఈ కార్డును ఆరోగ్య శ్రీ స్కీమ్ కు అనుసంధానం చేసి వైద్యా సేవలను అందించే యోచనలో సర్కార్ ఉంది.
ఆసరా పథకం కింద ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచిన రేవంత్ సర్కార్…. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికి డిజిల్ హెల్త్ కార్డులను త్వరలోనే అందజేయనుంది. దీని ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్కార్డులను అందజేయడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. త్వరలోనే వీటిని మంజూరు చేసే దిశగా సర్కార్ ఆలోచన చేస్తోంది.
E-Paper

