
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివార్ల దర్శనార్థం వచ్చే ప్రముఖులకు దేవస్థానం పాలకమండలి కీలక సూచనలు చేసింది. స్వామివారి దర్శనం, వసతి గదుల కోసం తీసుకువచ్చే సిఫార్సు లేఖలను కనీసం రెండు రోజుల ముందే ఆలయ అధికారులకు అందజేయాలని నిర్ణయించింది.
సిఫార్సు లేఖలతో వచ్చే ప్రముఖులకు స్పర్శదర్శనం వేళల్లో దేవస్థానం పలు మార్పులు చేసింది. తాజా నిర్ణయాల ప్రకారం… శని, ఆది, సోమవారాల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో సిఫార్సు లేఖలు ఉన్నవారికి స్పర్శదర్శన అనుమతి ఉండదు. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే స్పర్శదర్శనానికి అనుమతి ఇస్తారు.
మంగళవారం నుంచి గురువారం వరకు రోజుల్లో సాధారణ రోజుల్లాగే ప్రతిరోజూ మూడు విడతల్లో యథావిధిగా స్పర్శదర్శనం కల్పిస్తారు.పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పరిమితంగా స్పర్శదర్శనానికి అనుమతి ఇస్తారు.
విఐపిలు, ప్రముఖులు తమ సిఫార్సు లేఖలను దర్శన సమయానికి 2 రోజుల ముందే డిజిటల్ రూపంలో ఆలయ ప్రోటోకాల్ విభాగానికి పంపాల్సి ఉంటుంది. protocol@srisailadevasthanam.org, లేదా వాట్సాప్ నంబర్ కు 91600 16215 పంపాలని అధికారులు సూచించారు.
ముందస్తుగా అందని లేఖలను లేదా దర్శనం రోజున నేరుగా ఇచ్చే లేఖలను పరిశీలించడం కుదరదని, భక్తులు ఈ మార్పులను గమనించి ఆలయ యంత్రాంగానికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.