స్కూల్ టాయిలెట్లో రక్తపు మరకలు.. బట్టలు విప్పించి పీరియడ్స్ ఎవరికి ఉన్నాయో చెక్ చేయించిన ప్రిన్సిపల్!
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. పాఠశాల మరుగుదొడ్డిలో రక్తపు మరకలు కనిపించాయని, ఏ అమ్మాయికి పీరియడ్స్ అయ్యాయో బట్టు విప్పి చెక్ చేశారు.
మహారాష్ట్రలోని థానే జిల్లా షహాపూర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలికలను బలవంతంగా బట్టలు విప్పారు. పీరియడ్స్ అవుతున్నాయో లేదో చెక్ చేశారు. ఈ ఘటనలో పాఠశాల ప్రిన్సిపాల్, అటెండర్ను అరెస్టు చేసి మరో ఆరుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మంగళవారం ఉదయం పాఠశాల మరుగుదొడ్డిలో రక్తపు మరకలు కనిపించాయి. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు పీరియడ్స్ జరుగుతోందో లేదో తెలుసుకునేందుకు బట్టలు విప్పి చెక్ చేశారు ప్రిన్సిపాల్. తల్లిదండ్రులు, బాలల హక్కుల కార్యకర్తలు బుధవారం పాఠశాలకు చేరుకుని సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టాయిలెట్ను శుభ్రం చేస్తుండగా పీరియడ్స్ రక్తపు మరకలు కనిపించాయి. సిబ్బంది ఆ ఫొటోలను ప్రిన్సిపాల్కు పంపించారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలను పాఠశాల కన్వెన్షన్ హాల్కు పిలిపించారు. వారిలో ఎవరికైనా పీరియడ్స్ అవుతున్నాయా అని అడిగారు. అవుతున్న వారిని, అవ్వని వారిని రెండు గ్రూపులుగా చేశారు. రుతుస్రావం కావడం లేదని చెప్పిన అమ్మాయిలను ఒక్కొక్కరుగా టాయిలెట్ కు తీసుకెళ్లి మహిళా అటెండెంట్ బలవంతంగా బట్టలు విప్పి చెక్ చేశారు. బాలిక అవయవాలను ముట్టుకుని పీరియడ్స్ అవుతున్నాయో లేదో చూశారు. ఇంటికెళ్లిన తర్వాత బాలికలు విషయాన్ని ఇంట్లో చెప్పారు.
ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ.. 'నా కూతురు వణుకుతూ ఇంటికి వచ్చింది. వాష్ రూమ్ లో ఇతర విద్యార్థుల ముందు బలవంతంగా బట్టలు విప్పేశారని ఆమె తెలిపింది. ఇది క్రమశిక్షణ కాదు, మానసిక వేధింపు.' అని తల్లిదండ్రులు అన్నారు. తల్లిదండ్రులు పాఠశాల వద్ద గుమిగూడి బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని థానే (గ్రామీణ) అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ జల్టే తెలిపారు.
విద్యార్థుల ఫిర్యాదు మేరకు పాఠశాల ప్రిన్సిపాల్, నలుగురు ఉపాధ్యాయులు, అటెండర్లు, ఇద్దరు ధర్మకర్తలపై కేసు నమోదు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్, అటెండర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
E-Paper

