
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ముద్రగడను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంతకుముందు ముద్రగడ భౌతికకాయానికి మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ముద్రగడ సతీమణిని, ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబును కలిసి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పద్మనాభం గడిపిన క్షణాలను, ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కేవలం నివాళులర్పించి వెళ్లిపోకుండా, ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాల ప్రక్రియ పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ అక్కడే ఉన్నారు. అనంతరం ప్రారంభమైన ముద్రగడ అంతిమయాత్రలో స్వయంగా పాల్గొన్నారు.
అంతిమయాత్ర ముందుకు సాగుతుండగా…. ముద్రగడ పాడెను తన భుజాలపై మోసి ఆయన పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలా స్వయంగా పాడె మోయడం అక్కడికి వచ్చిన ప్రజలను, అభిమానులను కదిలించింది.
కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం దశాబ్దాలుగా పోరాడిన నేతగా ముద్రగడ పద్మనాభంకు పేరుంది. నిఖార్సయిన వ్యక్తిత్వానికి, రాజీపడని పోరాట పటిమకు ఆయన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఇటీవల కాలంలో ఆయన వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి నడిచారు. ఆయన మృతితో ఒక బలమైన ప్రజా నాయకుడిని కోల్పోయామని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ అంతిమయాత్రకు పార్టీ శ్రేణులతో పాటు వేలాది మంది అభిమానులు, స్థానికులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
ముద్రగడ కుటుంబ సభ్యులతో మాజీ సీఎం వైఎస్ జగన్