కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అప్డేట్ - మీ కార్డు ఎలా తీసుకోవాలంటే..?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. జూలై 14వ తేదీ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇందుకోసం సర్కార్ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. పంపిణీ ప్రక్రియను సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి……
ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.
రేషన్ కార్డుల మంజూరులో భాగంగా…. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా మొత్తం 11.30 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్సైట్( https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ) లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్సైట్ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసిన తర్వాత…. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త కార్డులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసే తేదీలతో పాటు ప్రాంతాలను స్థానిక అధికారులు ప్రకటిస్తారు. ఆ తేదీలకు అనుగుణంగా…. లబ్ధిదారులు వారి రేషన్ కార్డులను తీసుకోవచ్చు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ఆఫ్ లైన్, మీసేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రేషన్ కూడా తీసుకున్నారు.
తెలంగాణలోని కార్డుదారులకు ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కార్డుల మంజూరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి మే మాసం వరకు 2 లక్షలకుపైగా రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా 15 లక్షలకుపైగా కుటుంబ సభ్యుల పేర్లను జత చేసినట్లు తెలుస్తోంది,
కొత్త కార్డులతో పాటు పేర్లు జత చేయటం వంటి ప్రక్రియ సాగుతుండగా…. కొత్తగా ముద్రించిన కార్డుల పంపిణీ ఇంకా షురూ కాలేదు. అయితే ఈ ప్రక్రియను జూలై 14న ప్రారంభించాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగతున్నాయి.
E-Paper

