రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల కొత్త రేషన్ కార్డులు - రేపట్నుంచే పంపిణీ ప్రక్రియ..!
తెలంగాణలో రేపట్నుంచి (జూలై 14) కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది. తుంగతుర్తిలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 14వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తుంగతుర్తిలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
కొత్త కార్డుల పంపిణీతో జులై 14 నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్కార్డుల సంఖ్య 95,56,625కి పెరగనుంది. ఈ కార్డుల ద్వారా 3,09,30,911 మంది లబ్ధిదారులు కానున్నారు. సోమవారం రోజు(జూలై 14) 5,61343 రేషన్కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ తాజాగా ప్రకటించారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కార్డు రానివాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హత ఉన్నవాళ్లు కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
సీఎం చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుండగా… అన్ని జిల్లాల్లోనూ కొత్త రేషన్ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్లో 31,772 కొత్త కార్డులను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
బీపీఎల్( దారిద్య్ర రేఖకు దిగువ) కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డును అందజేస్తాం. ఏపీఎల్ కుటుంబాలకు పచ్చ కార్డును ఇస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మొత్తం రెండు రకాల కార్డులను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీ, పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.1150.68 కోట్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు మంజూరైన కొత్త కార్డులతో పాటు కుటుంబ సభ్యుల జోడింపు వివరాలను పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు నెంబర్ లేదా మీసేవలో దరఖాస్తు చేసుకున్న సమయంలో జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్సైట్లో కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్సైట్ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై నొక్కాలి. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి. ఈ లిస్ట్ లో పేర్లు ఉంటే… కొత్త కార్డును పంపిణీ చేస్తారు. వివరాలు అందుబాటులో లేకపోతే… వేచి చూడాల్సి ఉంటుంది.
E-Paper

