తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ఈ ఏడాది ఇంజినీరింగ్కు పాత ఫీజులే..!
ఇంజినీరింగ్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాదీ పాత ఫీజులే ఉంటాయని స్పష్టం చేసింది. ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వలేదు. దీంతో గతేడాది మాదిరిగానే ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు ఉండనున్నాయి.
ఈ విద్యా సంవత్సరం(2025-26) ఇంజినీరింగ్ విద్యకు పాత ఫీజులే ఉంటాయని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది.
బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ తో పాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2022-25 బ్లాక్ పీరియడ్ ఫీజులే ఈ ఏడాది కూడా అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి
మూడేళ్లకోసారి సాధారణంగా ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను పెంచుతుంటారు. ఈ ఏడాది ఫీజుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించారు. హేతుబద్ధంగా ఫీజుల పెంపును సిఫార్సు చేయడం కోసం ఒక కమిటీని కూడా నియమించింది
(image source istock.com)
ఇందులో భాగంగా 2025-28 (మూడేండ్లు) బ్లాక్ పీరియడ్లో ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) ప్రతిపాదనలు స్వీకరించింది. కాలేజీల వారీగా ప్రత్యక్ష విచారణలను కూడా జరిపింది. అయితే ఈసారి ఫీజులు పెంపు ఖాయమే అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వం ఫీజుల సవరణకు అనుమతులు ఇవ్వలేదు.
ఫీజుల సవరణపై ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిన ప్రతిపాదనలు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని విద్యాశాఖ తెలిపింది. ఆయా కళాశాలల ప్రతిపాదనలను పరిశీలించేందుకు అధికారులతో ప్రత్యేక కమిటీ వేస్తామని ప్రకటించింది. ఈ కమిటీ ఫీజుల పెంపు ప్రాతిపదికను పరిశీలిస్తుందని వివరించింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది నివేదిక ఇచ్చేంతవరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులనే ఈ ఏడాదికీ కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
గత ఏడాది తెలంగాణలో చూస్తే…. ఇంజనీరింగ్లో గరిష్ఠ ఫీజు రూ.1.60 లక్షలుగా ఉంది. ఈసారి వచ్చిన ప్రతిపాదనల్లో కొన్ని పేరొందిన కళాశాలలు వార్షిక ఫీజును రూ.2.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించాయి. కానీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ విద్యా సంవత్సరంలో కూడా పాత ఫీజులే ఉండనున్నాయి. తాజా నిర్ణయంతో విద్యార్థులకు… ఫీజుల పెంపు బారం తప్పినట్లు అయింది.
E-Paper

