
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA). అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించాయి.
ముఖ్యంగా సోమవారం (జులై 27) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం ప్రాంతాలు), విశాఖపట్నం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. వర్షం పడని సమయంలో వేడి, తేమతో కూడిన ఉక్కపోత వాతావరణం ఏర్పడి ప్రజలకు అసౌకర్యంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముంది. రాయలసీమ వ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, తీరం వెంట గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. ఈ నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కఠిన హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని అధికారులు ప్రజలను కోరారు.