కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేశారా..? ఈనెల 14 నుంచి కార్డుల పంపిణీ షురూ...!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహుర్తం ఫిక్స్ అయింది. ఈనెల 14వ తేదీన ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.4 లక్షల నూతన కార్డులను పంపిణీ చేయనుంది. ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేసింది.
ఈనెలలోనే 2.4 లక్షల కొత్త కార్డులను పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 11.30 లక్షల మంది పేదలకు ప్రయోజనం కలగనుంందని చెప్పారు.గడిచిన ఆరు నెలల కాలంలోనే 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందుతుందని వివరించారు.
ఇప్పటి వరకు మంజూరైన కొత్త కార్డులతో పాటు కుటుంబ సభ్యుల జోడింపు వివరాలను పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ ( https://epds.telangana.gov.in/ ) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు నెంబర్ లేదా మీసేవలో దరఖాస్తు చేసుకున్న సమయంలో జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్సైట్లో కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్సైట్ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
కాగా రాష్ట్రంలో పాత, కొత్త కార్డులు కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరుతుంది. లబ్ధిదారుల సంఖ్య 3,14,56,690కు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసిన తర్వాత…. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త కార్డులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసే తేదీలతో పాటు ప్రాంతాలను స్థానిక అధికారులు ప్రకటిస్తారు. ఆ తేదీలకు అనుగుణంగా…. లబ్ధిదారులు వారి రేషన్ కార్డులను తీసుకోవచ్చు.
జూలై 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది.
కొత్త రేషన్ కార్డులతో పాటు పాత కార్డులో జోడింపు అయిన కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా కూడా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పేర్లు వచ్చిన వాళ్లు… రేషన్ కూడా తీసుకుంటున్నారు. అయితే వీరికి ఫిజికల్ గా కార్డులను పంపిణీ చేస్తారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తై…. అర్హతలు ఉన్న వారికి కార్డులను ఇస్తున్నారు. మరికొందరి పేర్లను పాత కార్డుల్లోకి కూడా ఎంట్రీ చేస్తున్నారు. పేర్ల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇందులో భాగంగా… కొత్త కార్జులు మంజూరైన వారికి కార్డులను పంపిణీ చేయనున్నారు.
ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే మంజూరైన కార్డులతో సంబంధం లేకుండా… మీసేవ కేంద్రాల ద్వారా ఇంకా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
E-Paper

