Garuda Purnam: కొడుకు లేకపోతే అంతిమ సంస్కారాలు ఎవరు చేయాలి? గరుడ పురాణం చెబుతున్న ఆసక్తికర వాస్తవాలు!
Garuda Purnam: హిందూ ధర్మంలో మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ఉండే 16 సంస్కారాల్లో అంతిమ సంస్కారం అత్యంత కీలకమైనది. ఒకవేళ మృతుడికి కుమారులు లేకపోతే ఆ కర్మకాండలు నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? పూర్తి వివరాలు మీకోసం.
మనిషి జీవనయానంలో 16 సంస్కారాలకు విశిష్ట స్థానం ఉంది. అందులో చివరిదైన 'అంత్యేష్టి' లేదా అంతిమ సంస్కారం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఆత్మకు ప్రేత యోని నుంచి విముక్తి ప్రసాదించి, పితృ లోకానికి చేర్చే వారధి అని గరుడ పురాణం చెబుతోంది. సాధారణంగా తండ్రికి కొడుకే ముఖాగ్రి ఇవ్వాలని, పిండ ప్రధానం చేయాలని మన సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది. అయితే, మారుతున్న కాలంలో లేదా అనివార్య కారణాల వల్ల కొడుకు లేని పక్షంలో ఆత్మకు సద్గతి కలగదా? అంటే.. మన శాస్త్రాలు ఇందుకు అద్భుతమైన ప్రత్యామ్నాయాలను సూచించాయి.

వారసుడు లేకపోతే వారే కర్తలు
గరుడ పురాణం ప్రకారం, అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఒక క్రమ పద్ధతి ఉంది. ఒకవేళ కుమారుడు అందుబాటులో లేకపోయినా లేదా లేకపోయినా ఈ కింది వారు ఆ బాధ్యతను తీసుకోవచ్చు:
మనుమడు లేదా మునిమనుమడు: కుమారుడి కొడుకు (మనుమడు) లేదా మనవడి కుమారుడు (మునిమనుమడు) అధికారాన్ని కలిగి ఉంటారు.
ధర్మపత్ని: భర్త మరణించినప్పుడు కుమారులు లేకపోతే, భార్యకు ఆ కర్మకాండలు నిర్వహించే పూర్తి హక్కు ఉంటుంది. ఆమె శ్రాద్ధ తర్పణాలను కూడా చేయవచ్చు.
కుమార్తెలు: నేటి ఆధునిక కాలంలో కూతుళ్లు అంతిమ సంస్కారాల్లో పాలుపంచుకోవడం మనం చూస్తున్నాం. శాస్త్రాల ప్రకారం, కుమారులు లేని పక్షంలో కుమార్తెలు ఈ పవిత్ర కార్యాన్ని నిర్వర్తించవచ్చు. ఇది కేవలం సామాజిక మార్పు మాత్రమే కాదు, ధర్మబద్ధమైన చర్య కూడా.
సోదరుడు లేదా సోదరుడి కుమారుడు: తోడబుట్టిన తమ్ముడు లేదా అన్న, లేదంటే వారి కుమారులు కూడా అంతిమ క్రియలు చేయవచ్చు.
శిష్యుడు లేదా స్నేహితుడు: ఒకవేళ రక్త సంబంధీకులు ఎవరూ లేని పక్షంలో, మృతుడికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు లేదా ప్రాణ స్నేహితుడు శాస్త్రోక్తంగా సంస్కారాలు నిర్వహించవచ్చు.
విధివిధానాలతో నిర్వహించే అంతిమ సంస్కారం మాత్రమే ఆత్మకు శాంతిని చేకూరుస్తుంది. కర్త ఎవరన్నది ముఖ్యం కాదు, వారు చేసే సంకల్పం మరియు భక్తి ప్రధానం, అని పండితులు వివరిస్తున్నారు.
పిండప్రధానం ఎందుకు ముఖ్యం?
అంతిమ సంస్కారం తర్వాత జరిగే పిండప్రధానం, తర్పణం ఆత్మ తృప్తికి ఎంతో అవసరం. ఇవి లేకపోతే ఆత్మ ఈ లోకంలోనే భ్రమించి ఇబ్బందులు ఎదుర్కొంటుందని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. కాబట్టి, కర్త ఎవరైనప్పటికీ శాస్త్రోక్తంగా పది రోజుల కర్మలు, ఏకోద్దిష్ట శ్రాద్ధం నిర్వహించడం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుంది.
అవగాహన అవసరం
మరణం తర్వాత ఆత్మ ప్రయాణం సుఖమయం కావాలంటే సంస్కారాలు సక్రమంగా జరగాలి. కొడుకు లేడనే దిగులుతో ఆత్మను అశాంతికి గురిచేయడం కంటే, శాస్త్రం చెప్పిన ప్రత్యామ్నాయాలను అనుసరించి గౌరవప్రదంగా వీడ్కోలు పలకడమే ఉత్తమ మార్గం. మన సంస్కృతిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి సందేహానికి ఒక వివరణ ఉందని గరుడ పురాణం మరోసారి నిరూపిస్తోంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


