నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తూ ఉంటాము. ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిని అందంగా అలంకరించి ధూప, దీప, నైవేద్యాలను సమర్పిస్తాము. నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు మహా గౌరీదేవిని పూజిస్తారు. అష్టమి తిధి గౌరీదేవికి అంకితం చేయబడింది. గౌరీదేవి సౌమ్యతా, కరుణకు చిహ్నం. అష్టమి నాడు గౌరీని పూజించడం వలన సమస్యలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. ఈరోజు దుర్గాష్టమి నాడు ఉదయం 6.17 గంటల వరకు మూల నక్షత్రం కూడా వుంది. ఆ తరువాత, పూర్వాషాఢ వస్తుంది. ఈ రోజు మహాగౌరి పూజ, కన్యా పూజ చేసుకుంటే మంచిది.

అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12.02 నుంచి 12.51 గంటల దాకా ఉంటుంది. ఎద్దుపై స్వారీ చేస్తున్న గౌరీదేవి తెల్లని రంగులో ఉంటుంది. తెల్లని వస్త్రాలు ధరిస్తుంది. ఆమె రూపం భక్తులకు సానుకూల శక్తిని, ఆనందాన్ని తీసుకొస్తుంది. అష్టమి నాడు గౌరీదేవిని పూజించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. అయితే ఈ రోజు దుర్గాష్టమి సందర్భంగా గౌరీ దేవికి సంబంధించిన కథలు తెలుసుకుందాం.
శివుడు కోసం పార్వతీ కఠోర తపస్సు:
పురాణాల ప్రకారం చూసినట్లయితే, శివుడిని తన భర్తగా పొందాలని పార్వతీ దేవి సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో అరణ్యాలలో సుదీర్ఘ తపస్సు చేయడం కారణంగా ఆమె శరీరం దుమ్ము, ధూళితో కప్పబడి ఉంటుంది. దీంతో ఆమె శరీర వర్ణం నలుపుగా మారుతుంది. శివుడు ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు. తర్వాత ఆమె స్నానం చేస్తుంది. ఆమె అసలైన రంగు బయటపడుతుంది. అప్పటి నుంచి ఆమెను మహా గౌరీ అని పిలవడం మొదలైందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.
శుంభ, నిశుంభ వధ కథ:
ఇంకో కథ ఏంటంటే, రాక్షసులు శుంభ, నిశుంభ భూమిపై విధ్వంసం సృష్టించినప్పుడు పార్వతీ దేవి మాత్రమే వారిని చంపగలదు. అప్పుడు శివుడు పార్వతీదేవి ఛాయను నల్లగా మార్చాడు. యుద్ధంలో రాక్షసులను చంపిన తర్వాత దేవి తన నిజరూపం తిరిగి పొందడానికి తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఆమె భక్తికి సంతోషించిన శివుడు మానససరోవరంలో స్నానం చేయమని చెప్తాడు. స్నానం చేసిన తర్వాత మళ్లీ ఆమె తెల్లగా మారుతుంది. ఆమెను కౌశికి, మహా గౌరీ అని కూడా పిలుస్తారు.
గమనిక: ఇవి జ్యోతిష శాస్త్ర అంచనాలు మాత్రమే. మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి.
{{/usCountry}}గమనిక: ఇవి జ్యోతిష శాస్త్ర అంచనాలు మాత్రమే. మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి.
{{/usCountry}}