...
...
Next Story

జగన్నాథ రథయాత్ర 2026: జగన్నాథ రథయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? తేదీలు, విశిష్టత, ఆసక్తికర చరిత్ర ఇవే

జగన్నాథ రథయాత్ర ప్రారంభం నుండి ముగింపు తేదీ: జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. ఇది సాధారణంగా జూన్ లేదా జూలై నెలలో ప్రారంభమవుతుంది. ఈసారి జగన్నాథ రథయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకోండి.

Published on: Jun 5, 2026, 08:00:37 IST
Advertisement

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు ప్రతిరూపంa. భక్తజన సంద్రం మధ్య తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ ఉత్సవాన్ని రథోత్సవం లేదా శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి గుండిచా దేవి మందిరం వరకు ఈ రథయాత్ర సాగుతుంది.

జగన్నాథ రథయాత్ర 2026: జగన్నాథ రథయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? తేదీలు, విశిష్టత, ఆసక్తికర చరిత్ర ఇవే
జగన్నాథ రథయాత్ర 2026: జగన్నాథ రథయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? తేదీలు, విశిష్టత, ఆసక్తికర చరిత్ర ఇవే

జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవిలకు అంకితమైన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఏటా ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా ముగ్గురు దేవతామూర్తులను భారీ, సుందరమైన రథాలపై ప్రతిష్ఠించి నగర వీధుల్లో ఊరేగిస్తూ గుండిచా ఆలయానికి తరలిస్తారు. ఈ గుండిచా మందిరాన్ని స్వామివారి మేనత్త ఇల్లుగా భక్తులు భావిస్తారు.

రథయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?

హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16, గురువారం నాడు ప్రారంభం కానుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు జూలై 24న ముగుస్తాయి. చివరి రోజున స్వామివారు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దీనినే బహుదా యాత్ర లేదా తిరుగు రథయాత్ర అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు పూరీ క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది.

జగన్నాథ రథయాత్ర విశిష్టత

సనాతన ధర్మంలో రథయాత్ర దర్శనానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. "రథంపై ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే సర్వపాపాలు నశించి, మరణానంతరం మోక్షం లభిస్తుంది," అని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ జగన్నాథుడి రథాన్ని లాగే వారికి అక్షయ పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.

పౌరాణిక కథల ప్రకారం, జ్యేష్ఠ పూర్ణిమ నాడే జగన్నాథ స్వామి జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఈ పవిత్రమైన రోజున జగన్నాథుడిని, బలరాముడిని, సుభద్ర దేవిని రత్న సింహాసనం నుంచి దించి ఆలయం సమీపంలోని స్నాన మండపానికి తీసుకువస్తారు. అక్కడ స్వామివార్లకు 108 కలశాల జలంతో పవిత్ర రాజ స్నానం చేయిస్తారు. "జ్యేష్ఠ పూర్ణిమ నాడు జరిగే పవిత్ర స్నానం వల్లే స్వామివారు జ్వరంతో అనారోగ్యానికి గురవుతారు," అని ఆలయ అర్చకులు వివరిస్తారు.

అనారోగ్యం వల్ల స్వామివారిని 15 రోజుల పాటు ఒక ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రధాన సేవకులు, వనమూలికలు అందించే రాజవైద్యులు తప్ప మరెవ్వరూ ఆ గదిలోకి వెళ్లడానికి వీల్లేదు. ఈ 15 రోజుల పాటు భక్తులకు స్వామివారి దర్శనం లభించదు. దీనిని అణసర కాలం అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఆషాఢ విదియ నాడు 'ఛేరా పహరా' అనే ప్రత్యేక ఆచారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పూరీకి చెందిన గజపతి రాజు బంగారు పొరకతో రథాల మండపాన్ని శుభ్రం చేస్తారు. ఈ క్రతువు ముగిసిన తర్వాతే భక్తులు రథాలను లాగడం ప్రారంభిస్తారు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా మతపరమైన గ్రంథాలు, వివిధ నమ్మకాల ఆధారంగా సేకరించినది మాత్రమే. దీనిని ధృవీకరించే శాస్త్రీయ ఆధారాలు లేవు. పూర్తి వివరాల కోసం సంబంధిత రంగాల నిపుణులను సంప్రదించగలరు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe