రేపు యమ ద్వితీయ నాడు లక్ష్మీ కుబేర పూజ చేస్తే సంపద, భోగభాగ్యాలు కలుగుతాయి.. భగినీ హస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాథ ఇదే!
ఈసారి యమ ద్వితీయ అక్టోబర్ 23న వచ్చింది. పవిత్రమైన కార్తీకమాసం మొదలైపోయింది. ఈ నెలంతా భక్తులు పూజలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీకమాసంలో వచ్చే యమద్వితీయ కూడా చాలా ప్రత్యేకమైనది. మరి ఈరోజు ఏం చేయాలి, భగినీ హస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాధ తెలుసుకుందాం.
కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్ష ద్వితీయను యమ ద్వితీయ అని అంటారు. ఈసారి యమ ద్వితీయ అక్టోబర్ 23న వచ్చింది. పవిత్రమైన కార్తీకమాసం మొదలైపోయింది. ఈ నెలంతా భక్తులు పూజలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, శివనామాన్ని జపిస్తారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీకమాసంలో వచ్చే యమద్వితీయ కూడా చాలా ప్రత్యేకమైనది. మరి ఈరోజు ఏం చేయాలి, భగినీ హస్త భోజనం వెనుక ఉన్న పురాణ గాధ మొదలైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అక్షయ లక్ష్మి కుబేర పూజ
యమద్వితీయ లేదా భగినీ హస్త భోజనం రోజు అక్షయ లక్ష్మి కుబేర పూజ చేస్తే మంచిది. లక్ష్మీదేవి తన సంపదను కుబేరుడికి ఇచ్చి హరి భక్తుల్లో లీనం అయిపోతుంది. అందుకని ఆ రోజు లక్ష్మి కుబేర చిత్రపటాన్ని పెట్టి పూజిస్తే సంపద, భోగభాగ్యాలు కలుగుతాయి.
పూజా విధానం:
- ఈరోజు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని పూజామందిరాన్ని అందంగా అలంకరించుకోవాలి.
- లక్ష్మి కుబేర చిత్రపటాన్ని పెట్టి గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి.
- ఆ తర్వాత చిత్రపటం ముందు అరిటాకు పెట్టి నవధాన్యాలు పోయాలి. వాటిపై తమలపాకు పెట్టి పసుపు గణపతిని ఉంచి పూజ చేయాలి.
- ఆ తర్వాత రాగి చెంబును నవధాన్యాలపై పెట్టాలి.
- లక్ష్మి కుబేర చిత్రపటాన్ని కూడా పెట్టి, లక్ష్మీదేవి ముందు నాణేలు పెట్టాలి. వివిధ రకాల పువ్వులతో పూజ చేయాలి. పండ్లను నైవేద్యంగా పెట్టాలి.
- తర్వాత పండ్లను, తాంబూలాన్ని పెట్టి ముత్తైదువులకు వాయనం ఇస్తే మంచిది.
- ఈరోజు “ఓం ధనదా సౌభాగ్య లక్ష్మి కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురుస్వాహా” అనే మంత్రాన్ని 21 సార్లు చదివితే మంచిది.
భగినీ హస్త భోజనం వెనుక పురాణ గాథ
అల్పాయుష్కుడైన మార్కండేయుడు ధర్మరాజు విస్తరించిన యమపాశం నుండి తప్పించుకోవాలని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకుంటాడు. ఆ సమయంలో యమపాశం శివలింగాన్ని తాకుతుంది. కోపం వచ్చిన శివుడు యమధర్మరాజుపై త్రిశూలాన్ని విసురుతాడు. ఆ త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు తప్పించుకోవడానికి పరిగెడతాడు. చివరికి తన చెల్లెలు యమున దగ్గరకు వెళ్లి తలదాచుకుంటాడు. ఎన్నోసార్లు పిలిచిన అన్న ఆకస్మాత్తుగా తన ఇంటికి రావడంతో ఆనందభరితమైన యమున తన అన్నకు సకల మర్యాదలు చేస్తుంది.
అన్నకు ఇష్టమైన భోజనాన్ని పెడుతుంది. భోజనం చేసే వారిని సంహరించరాదని శివుడు ఆజ్ఞ మేరకు త్రిశూలం వెనక్కి వెళ్తుంది. ఆ త్రిశూలం నుండి రక్షణ కల్పించి, తనకోసం చెల్లెలు చేసిన అతిథి మర్యాదలు చూసి యముడు సంతోషిస్తాడు. కార్తీక శుక్ల ద్వితీయ నాడు సోదరి ఇంటికి వెళ్లి, ఆమె చేసిన భోజనం తింటే అపమృత్యు శాపం ఉండదని, దీర్ఘాయుష్షు కలుగుతుందని చెల్లెలు యమునకు యమధర్మరాజు చెబుతాడు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


