వరలక్ష్మీ వ్రత కథ ఇదే.. చదివితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం!
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం ఆనవాయితీ. లక్ష్మీదేవిని నియమ నిష్ఠలతో పూజించి, పూజా విధానాన్ని పాటించి, చివరగా వరలక్ష్మీ వ్రత కథను చదువుకోవడం ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటాము. ఆరోజు వరాలు ఇచ్చే లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి, కోరికలు నెరవేరుతాయి. వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారు అమ్మవారిని నియమ నిష్ఠలతో ఆరాధించాలి. అలాగే పూజా విధానాన్ని తప్పనిసరిగా పాటించాలి.

చివరగా వ్రత కథ చదువుకోవాలి. ఇలా అమ్మవారిని సరిగ్గా విధానంలో ఆరాధించడం వలన వరాలు ఇచ్చే ఆ అమ్మవారి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. అలాగే అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఈరోజు వరలక్ష్మీ వ్రత కథ గురించి తెలుసుకుందాం.
శ్రీ వరలక్ష్మీ వ్రత కథ
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఈ విధంగా చెప్పారు: “మునులారా! స్త్రీలకు సౌభాగ్యకరమైన వ్రతము ఒకటి ఉంది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. లోక ఉపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి.”
పరమేశ్వరుడు ఓ రోజు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదుడు, ఇంద్రాది దిక్పాలకులు స్తోత్రములతో శివుని ఆరాధిస్తున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి, “నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యాలను పొందే వ్రతం ఒకటి చెప్పండి” అని అడిగింది.
అప్పుడు త్రినేత్రుడు, “దేవీ! నువ్వు కోరిన విధంగా ఒక వ్రతం ఉంది. ఈ వ్రతం స్త్రీలకు సకల శుభాలు కలుగుతాయి. అదే వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలి” అని చెప్పాడు.
పార్వతీదేవి, “దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? అసలు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెప్పండి” అని కోరింది. కాత్యాయనీ! మగధ దేశంలో విష్ణుకుండినము అనే పట్నము ఒకటి ఉంది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్నంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. చారుమతి సుగుణవతి, వినయ విధేయురాలు. యోగ్యురాలై, బ్రతకాలని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకునే, గృహకృత్యాలను పూర్తిచేసే, అత్తమామల్ని సేవించుకుని, మితంగా సంభాషిస్తూ ఉండేది.
ఓ రోజు రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి కనిపించి, “ఓ చారుమతీ! శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించినట్లయితే కోరిన వరాలు, కానుకలు ఇస్తాను” అని చెప్పి అంతర్ధానం అయిపోయింది.
చారుమతి చాలా సంతోషపడి, “నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, సంపన్నులుగా, విద్వాంసులుగా, మాన్యులుగా ఉంటారు. నా పూర్వజన్మ సుకృతం కారణంగా నీ దర్శనం కలిగింది” అని చారుమతి వరలక్ష్మీదేవిని స్తుతించింది. ఇంతలో చారుమతి మేల్కొని, అదంతా కల అని గుర్తించింది. ఆ కల గురించి భర్తకు, అత్తమామలకు చెప్పింది. వారు సంతోషపడి చారుమతిని వరలక్ష్మీ వ్రతం చేసుకోమని అన్నారు.
ఊరులోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. స్త్రీలంతా ఉదయాన్నే తలస్నానం చేసి, పట్టువస్త్రాలు కట్టుకుని చారుమతి గృహానికి చేరుకున్నారు.చారుమతి తన ఇంట్లో మండపాన్ని ఏర్పరిచి, ఆ మండపంపై బియ్యం పోసి, పంచపల్లవాలైనటువంటి జువ్వి, రావి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశాన్ని పెట్టి, వరలక్ష్మీదేవిని సంకల్ప విధానంతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది.
అమ్మవారిని శుభచారాలతో పూజించి, భక్ష భోజ్యాలను నివేదన చేసారు. తొమ్మిది పోగుల తోరణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేసి, భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని ఆరాదించారీ. ఈ వ్రతాన్ని బ్రాహ్మణాది నాలుగు జాతుల వారు చేయొచ్చు. అలా చేయడం వలన సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


