హైదరాబాద్ నగరంలో విషాద ఘటన వెలుగు చూసింది. మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మీన్ రెడ్డి అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాథమిక వివరాల ప్రకారం…. మంగళవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్లో మీన్ రెడ్డి పోలీసులకు చిక్కాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో 120 పాయింట్లు రావడంతో మీన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అతడి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కట్ చేస్తే…. అర్ధరాత్రి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ వద్ద మీన్రెడ్డి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు ఆర్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
మీన్రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.