గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సందీప్ ఏసీబీకి చిక్కాడు. రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
రూ. 10 వేలు లంచం డిమాండ్….

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. రైతుబీమా కోసం చనిపోయిన రైతు కుమారుడు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును ప్రాసెస్ చేసి… ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించడానికి మర్రిపెడ మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేస్తున్న జి. సందీప్రూ . 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో దరఖాస్తుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
పక్కాగా ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుడి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా సందీప్ ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.