అలర్ట్.. వాహన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే భారీ జరిమానాలు తప్పవు!

వాహన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే భారీ జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న మెుబైల్ నెంబర్ యాడ్ చేయాలని సూచించారు.

Published on: Jun 21, 2026, 20:35:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. వాహనదారులు తమ ప్రస్తుత మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను వాహన్ డేటాబేస్‌లో వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అలా చేయని పక్షంలో ట్రాఫిక్ ఈ-చలాన్లు, రవాణా శాఖ పంపే అధికారిక నోటీసులు మీకు అందకుండా పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

వాహన్ పోర్టల్‌లో మెుబైల్ నెంబర్ అప్డేట్
వాహన్ పోర్టల్‌లో మెుబైల్ నెంబర్ అప్డేట్

ఈ మేరకు రవాణా శాఖ అధికారులు 'వాహన్' పోర్టల్ ద్వారా ఒక అధికారిక మార్గదర్శకాన్ని విడుదల చేశారు. చాలా మంది వాహనదారులు వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలో ఒక మొబైల్ నంబర్ ఇస్తారని, ఆ తర్వాత కాలంలో నంబర్లు మార్చినా.. ఆ కొత్త వివరాలను రవాణా శాఖ సిస్టమ్‌లో అప్‌డేట్ చేయడం లేదని అధికారులు గుర్తించారు. దీనివల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ నోటీసులు పాత ఫోన్ నంబర్లకే వెళ్తున్నాయి.

ఫలితంగా, తమ వాహనంపై చలాన్లు ఉన్నాయనే విషయం కూడా యజమానులకు తెలియడం లేదు. వాహన్ డేటాబేస్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీకి పంపిన ఏ నోటీసునైనా సరే.. సదరు వాహనదారుడికి అధికారికంగా చేరినట్లుగానే రవాణా శాఖ పరిగణిస్తుంది. "మాకు మెసేజ్ రాలేదు" లేదా "నోటీసు అందలేదు" అని వాహనదారులు తప్పించుకోవడానికి వీల్లేదు. వివరాలు అప్‌డేట్ చేసుకోకపోవడం పూర్తిగా యజమాని బాధ్యత హీనత కిందికే వస్తుంది.

అప్‌డేట్ చేయకపోతే వచ్చే నష్టాలు

చలాన్లు పడిన విషయం తెలియకపోవడం వల్ల సకాలంలో జరిమానాలు చెల్లించలేరు. దీనివల్ల పెనాల్టీలు పేరుకుపోతాయి. కొన్ని రకాల తీవ్రమైన ఉల్లంఘనలకు సంబంధించి సకాలంలో స్పందించకపోతే, నేరుగా కోర్టు నుండి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో వాహనానికి సంబంధించిన సేవలు పొందడం కష్టమవుతుంది. ముఖ్యంగా: వాహన యాజమాన్య మార్పిడి, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్, నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందడం, చిరునామా మార్పు వంటి పనుల సమయంలో పాత చలాన్లు అడ్డుపడతాయి.

మొబైల్ నంబర్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?

వాహనదారులు నేరుగా అధికారిక VAHAN / Parivahan పోర్టల్‌లోకి లాగిన్ అయి, తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా మొబైల్ నంబర్‌ను ఎడిట్/అప్‌డేట్ చేసుకోవచ్చు.

త్వరితగతిన అప్‌డేట్ చేసుకోవడానికి రవాణా శాఖ ఒక ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీన్ని స్కాన్ చేసి నేరుగా వివరాలు నమోదు చేయవచ్చు.

రవాణా శాఖ ఆర్టీఏ (RTA) ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ-చలాన్లు, ఇతర సమాచారాన్ని కేవలం సాధారణ ఎస్ఎమ్ఎస్ (SMS) రూపంలోనే కాకుండా, వాట్సాప్ (WhatsApp), ఈమెయిల్స్ ద్వారా కూడా పంపుతున్నామని, కాబట్టి వాహనదారులు తమ సరైన కాంటాక్ట్ వివరాలను సిస్టమ్‌లో ఉంచుకోవడం ఎంతో ఉత్తమమని సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More