చిన్నారుల ఆరోగ్యం కోసం తెలంగాణలో కొత్త పథకం.. బాల భరోసా!
తెలంగాణలో చిన్నారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. అదే బాల భరోసా స్కీమ్. పిల్లల ఆరోగ్యమే లక్ష్యంగా ఇది ఉండనుంది.
సంక్షేమ పథకాల అమలులో భాగంగా మరో కొత్త పథకాన్ని తీసుకువస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఐదు సంవత్సరాలలోపు పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా బాల భరోసా అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న చిన్నారులు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించనున్నారు. దీని ద్వారా పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా ఉండనుంది. త్వరలోనే బాల భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఈ స్కీమ్ను పర్యవేక్షిస్తాయి.

కొన్ని రోజుల కిందట రాష్ట్రంలోని అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిర్వహించారు. దానికి సంబంధించిన రిపోర్టులు ప్రభుత్వం వద్దకు వెళ్లాయి. సర్వేలో దాదాపు 8 లక్షల మంది చిన్నారులు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. అనేక మంది రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. మరికొందరేమో వినికిడి, దృష్టి లోపాలు, సరైన ఎదుగుదల లేకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి.. అండగా నిలిచేందుకు ప్రభుత్వం బాల భరోసా పథకం ప్రారంభిస్తోంది. ఈ స్కీమ్లో భాగంగా వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్ చేస్తారు. వినికిడి సమస్య ఉన్న వారికి అవసరమైన పరికరాలను అందిస్తారు. ఇతర వైద్య సేవలు కూడా ఫ్రీగా ఉంటాయి.
బాల భరోసా పథకం ఆరోగ్య శ్రీకి అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులు ఉంటే.. చికిత్స ఖర్చులను సీఎంఆర్ఎఫ్ నుంచి చెల్లించేలా ఏర్పాట్లు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమాన్ని కూడా ఇందులో విలీనం చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తోంది. దీంతో ప్రతీ చిన్నారి మెడికల్ రిపోర్టులు, వారికి అందిస్తున్న ట్రీట్మెంట్, దాని పురోగతి ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. ఈ పథకంతో లక్షలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు రానున్నాయి. చిన్న వయసులో మెరుగైన వైద్యం తీసుకుని.. సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది.













