Bandi Bhageerath bail : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన బండి భగీరథ్ కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం రాత్రి వరకు విచారణ జరిపింది. అనంతరం బండి సంజయ్ కుమారుడి ముందస్తు బెయిల్పై ఇప్పట్లో ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ పూర్తి వ్యవహారంపై మే 21, గురువారం నాడు తీర్పును వెలువరిస్తామని ప్రస్తుతానికి రిజర్వులో పెట్టింది.

కాగా.. మైనర్పై లైంగిక వేధింపుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న భగీరథ్కి అరెస్ట్ (కనీసం ముందస్తు బెయిల్ తీర్పు వెలువడే వరకైనా) నుంచి రక్షణ కల్పించాలని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ మేరకు పోలీసులకు అన్ని విధాలుగా సహకరించేందుకు తమ క్లైంట్ సిద్ధమని వివరించారు. ఈ విజ్ఞప్తిని సైతం హైకోర్టు తోసిపుచ్చింది.
అర్థరాత్రి వరకు విచారణ- బెయిల్కి నో!
బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై జస్టిస్ మాధవీదేవి శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు అర్థరాత్రి 12 గంటల వరకు విచారణ జరిపారు. తన క్లైంట్ని ఇరికించేందుకే పోలీసులు అతనిపై పోక్సోలోని కఠినమైన సెక్షన్ల కింద కేసు వేశారని నిందితుడి తరఫు న్యాయవాది, వైసీపీ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి వాదించారు. డిసెంబర్లో ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారని, కానీ మార్చ్ నెలలో న్యాయనిపుణుల సూచనలతో పక్కా ప్రణాళికతో మే నెలలో కేసు వేశారని అన్నారు. పైగా రాష్ట్రంలో తమ పిటిషనర్ తండ్రికి సంబంధించిన ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉందని ఆయన గుర్తుచేశారు.
“మా క్లైంట్, ఫిర్యాదు దాఖలు చేసిన మైనర్ రిలేషన్లో ఉన్నట్టు అందరికి తెలుసు. మైనర్ తల్లిదండ్రులకు కూడా తెలుసు. వారిద్దరు కలిసే తిరిగేవారు. గతేడాది జరిగింది అంటున్నారు. కానీ ఇంత ఆలస్యంగా కేసు పెట్టారు. వాస్తవానికి మొదట చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు పెట్టారు. కానీ బెయిల్ వచ్చేస్తుందేమో అనే పెద్ద పెద్ద సెక్షన్లతో ఇరికించారు. అందుకే నా క్లైంట్ ముందస్తు బెయిల్కి అర్హుడు,” అని ఎస్ నిరంజన్ రెడ్డి తన వాదనలో వివరించారు.
దీనికి బదులుగా మైనర్ తరఫు న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు జడ్జి ముందు తన వాదనలు వినిపించారు.
“నా క్లైంట్తో పాటు బండి భగీరథ్ మరో నలుగురు అమ్మాయిలను వేధించాడు. వాళ్లందరు త్వరలోనే బయటకు వస్తారు. కానీ కేసును తప్పుదోవ పట్టించే విధంగా ఎంపీ తన అధికార బలన్ని వాడుకుంటున్నారు. ఇంతటి తీవ్రమైన కేసులో ముందస్తు బెయిల్, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడం సరైనది కాదు,” అని పేర్కొన్నారు.
తమ పిటిషనర్ తండ్రి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో లేరని, అలాంటప్పుడు కేసును ఎలా ప్రభావితం చేయగలరని, అవన్ని తప్పుడు ఆరోపణలను బండి భగీరథ్ న్యాయవాది కోర్టు ఎదుట వ్యాఖ్యానించారు.
బండి భగీరథ్ తరఫు న్యాయవాది వాదనలు, మైనర్ వాగ్మూలాన్ని పరిశీలించిన అనంతరం కేసు తీవ్రత నేపథ్యంలో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ విటిషన్పై ఈ దశలో తీర్పును వెలువరించలేమని తెలంగాణ హైకోర్టు జస్టిస్ మాధవీదేవి తేల్చేశారు.