Hyderabad Police : ఉచితంగా రూ.5 వేలంటూ సైబర్ మోసాలు…. జాగ్రత్త! ఆ లింక్స్ పై క్లిక్ చేయకండి

ఉచితంగా రూ.5 వేలంటూ సైబర్ మోసాలు జరుగుతున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ఇలాంటి వాటిపట్ల ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. అనధికారిక లింకులపై క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.

Published on: Jan 18, 2026 12:34 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో వస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం వాట్సాప్‌లో "ఫోన్ పే రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్", "సంక్రాంతి కానుక" అంటూ కొన్ని నకిలీ లింకులు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయని చెప్పారు. వీటిని క్లిక్ చేస్తే రూ. 5,000 ఉచితంగా పొందవచ్చని సైబర్ నేరగాల్లు ఆశపెడుతున్నారని హెచ్చరించారు.

ఉచితంగా రూ.5 వేలంటూ సైబర్ మోసాలు.. జాగ్రత్త!
ఉచితంగా రూ.5 వేలంటూ సైబర్ మోసాలు.. జాగ్రత్త!

ఆలోచించండి - సీపీ సజ్జనార్

“మొదట ఇది నకిలీ అనుకున్నాను, కానీ నిజంగానే నాకు రూ. 5,000 వచ్చింది! మీరు కూడా ప్రయత్నించి చూడండి! అంటూ ఒక లింక్‌ను షేర్ చేస్తున్నారు. ఇది అమాయకులను బుట్టలో వేయడానికి నేరగాళ్లు వాడే ఒక సైకలాజికల్ ట్రిక్ మాత్రమే. మీకు తెలిసిన వారి నుండి లేదా గ్రూపుల నుండి ఇలాంటి సందేశాలు వస్తే ఒక్క నిమిషం ఆలోచించండి” అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.

ఆ మెసేజ్ చివరన ఉండే లింకులను గమనించాలని సజ్జనార్ పేర్కొన్నారు. అవి http://fdgc.lusvv.xyz లేదా http://iom.qmtyw.xyz వంటి వింత అక్షరాలతో ఉంటాయని వివరించారు. ఇవి అధికారిక ఫోన్ పే లింకులు కావని గ్రహించాలని హెచ్చరించారు.

“ఆశపడి ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్‌లోకి ప్రమాదకరమైన మాల్వేర్ ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ పిన్, పాస్‌వర్డ్‌లు తస్కరించి.. క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు. ఫోన్ పే, గూగుల్ పే లేదా మరే ఇతర సంస్థ అయినా ఇలా వాట్సాప్ లింకుల ద్వారా డబ్బులు పంచదు. ఏ ఆఫర్ ఉన్నా అది వారి అధికారిక యాప్‌లోనే కనిపిస్తుంది” అని సజ్జనార్ తెలిపారు.

ఒకవేళ పొరపాటున ఎవరైనా ఈ లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే, వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు.