అప్పటికప్పుడు ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకుని బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు? : సీపీ సజ్జనార్

మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన వార్తల అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా ఈ కేసులో ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. దీనిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు.

Published on: Jan 14, 2026 6:05 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహిళా ఐఏఎస్ అధికారిపై ఇటీవల ఓ న్యూస్ ఛానల్ వార్త పబ్లిష్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కొన్ని రోజులుగా తెలంగాణలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఈ కేసుపై దర్యాప్తు కోసం హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. తాజాగా జర్నలిస్టుల అరెస్టు విషయంపై సజ్జనార్ మాట్లాడారు. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు.

సీపీ సజ్జనార్
సీపీ సజ్జనార్

రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారని సీపీ సజ్జనార్ ప్రశ్నించారు. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నిస్తే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మరో రిపోర్టర్ విచారణకు వస్తానని, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారన్నారు. అందుకే వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని తెలిపారు. ఓ టీవీ ఛానెల్ సీఈవో ఎక్కడ ఉన్నారని, పిలిస్తే విచారణకు రావాలి కదా అన్నారు. మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలన్నారు.

అన్ని చట్ట ప్రకారమే జరుగుతాయని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. విమర్శలు సహేతుకంగా ఉండాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళా అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం క్రూరత్వమేనన్నారు. మహిళాలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారన్నారు. మహిళా అధికారులపై అసత్య కథనాలు ప్రసారం అయితే.. సమాజంలో ఎలా పని చేయగలుగుతారన్నారు. మహిళా అధికారులను కించపరుస్తూ.. వార్తలు ఎలా రాస్తారని అని సజ్జనార్ అడిగారు. అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని, సీఎంపై అవమానకర వార్తలు వేయడంపై మరో కేసు నమోదైందన్నారు. ఈ రెండు కేసులకు సంబంధించి.. సిట్ విచారణ జరుపుతోందన్నారు సీపీ.

అంతకు మందు సోషల్ మీడియా ఎక్స్‌లో సజ్జనార్ పోస్ట్ చేశారు. 'విమర్శలు, పరిశీలనలు ప్రజా జీవితంలో భాగం. కానీ ఏ స్త్రీనైనా - ఆమె ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ రంగంలో నిపుణురాలు అయినా, లేదా గృహిణి అయినా - మాటలు, టీవీ కథనాలు లేదా సోషల్ మీడియా ద్వారా కించపరచడం విమర్శ కాదు; అది క్రూరత్వం. ఇది ఆమోదయోగ్యం కాదు. దీనిని అందరూ సంకోచం లేకుండా ఖండించాలి.' అని సజ్జనార్ అన్నారు.

నేడు మహిళలు పరిపాలన, పోలీసింగ్, పాలన, సైన్స్, ప్రజా జీవితం, మీడియాలో ముందుండి నాయకత్వం వహిస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. ఇంట్లో కూడా నాయకత్వం వహిస్తున్నారని, కనిపించని బాధ్యతలను మోస్తున్నారన్నారు. పని, కుటుంబం, సమాజాన్ని సమతుల్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి వ్యక్తిత్వంపై దాడి చేయడం అంటే మనం విలువైనదిగా చెప్పుకునే పురోగతిపై దాడి చేయడమేనన్నారు.

ఇటీవల ఉద్దేశపూర్వకంగా మహిళా అధికారులను వ్యక్తిత్వ దాడుల ద్వారా లక్ష్యంగా చేసుకోవడం చాలా బాధాకరం అని ఎక్స్ పోస్ట్‌లో సజ్జనార్ రాసుకొచ్చారు. ఇది వ్యక్తిగతమైనది, హానికరమైనది, పూర్తిగా ఆమోదయోగ్యం కాదన్నారు. ముఖ్యంగా ముందుండి నడిపించే మహిళలను గౌరవించలేని సమాజం తన భవిష్యత్తును తానే దెబ్బతీసుకుంటుందన్నారు.