హైదరాబాద్లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం గ్లాస్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనలో అన్న ప్రాణాలు కోల్పోగా… తమ్ముడు అరెస్ట్ అయ్యాడు. భవనం పైనుంచి తోసేయటంతో ఈ ఘటన జరిగింది.
గ్లాస్ విషయంలో గొడవ…

ప్రాథమిక వివరాల ప్రకారం…. ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నివాసంలో ఉంటారు. సంక్రాంతి పండుగ వేళ బుధవారం అర్ధరాత్రి సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ తమ నివాసం ఉంటున్న భవనంపై మద్యం సేవించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం గ్లాస్ విషయంలో గొడవ జరిగింది. ఇది కాస్త మాట మాట పెరిగి పెద్దదిగా మారింది. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు…. క్షణికావేశంలో తన అన్న రోహన్ను భవనం పైనుంచి కిందకు తోసేశాడు.
3 అంతస్తుల భవనంపై నుంచి కింద పడిపోయిన సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశారు. మార్గమధ్యలోనే సోదరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటానాస్థలికి చేరుకున్న నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో తమ్ముడైన లయనెల్ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పండగ వేళ ఈ ఘటన వారి కుటుంబంలో కోలుకోలేని విషాదాన్ని నింపినట్లు అయింది.