ఔటర్ లోపల పూర్తి ప్రక్షాళన - పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం...! సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ మేరకు జోనల్ కమిషనర్లకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

Published on: Dec 31, 2025, 05:15:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియా (క్యూర్) లో ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. కోర్-అర్బన్ రీజియన్‌ను మొత్తంగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని హైదరాబాద్ నగర జోనల్ కమిషనర్లను ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నగరాన్ని వివిధ జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు.

సీఎం రేవంత్ కీలక సూచనలు:

  • “రాష్ట్రం మొత్తం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నాం. హైదరాబాద్ నగర పరిపాలన పట్టాలెక్కించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రధానంగా నగరంలో చెత్త నిర్వహణ అత్యంత సంక్లిష్టమైన సమస్య. ఈ సమస్యపై జోనల్ కమిషనర్లు తమ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
  • చెత్త నిర్వహణతో పాటు జోన్ల వారీగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదే. జోనల్ కమిషనర్లు ప్రతీ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిందే. నగరంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దశల వారీగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి.
  • చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.
  • నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదు. అలాగే రోడ్లపై గుంతలు కనిపించొద్దు. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
  • ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై వీలయినంత తొందరగా స్పందించాలి. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రభలకుండా చర్యలు చేపట్టాలి.
  • కోర్-అర్బన్ ఏరియాలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాలని నిర్ణయించాం. నగరంలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నాం.
  • ప్రజలకు ముఖ్యంగా జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరక్కుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. ఆన్‌లైన్ సేవల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి.
  • కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లతో అనుసంధానం ఉండేలా కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి.
  • హైడ్రా, జీహెచ్ఎంస్, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలి. నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలి. కోర్ అర్బన్ ఏరియాలో ఆయా విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారు. అందరూ కలిసి పనిచేస్తేనే నగర భవిష్యత్తు బాగుంటుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More