Telangana Smart Ration Cards : 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధం - ఈనెల 15 నుంచి పంపిణీ ! ముఖ్యమైన 8 పాయింట్లు

Telangana Smart Ration Card 2026 : ఆగస్ట్ 15వ తేదీన సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.06 కోట్లకు పైగా కార్డుల ద్వారా 3.43 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.

Published on: Aug 12, 2026, 07:20:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Smart Ration Card 2026 : రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేద ప్రజలకు పౌర సరఫరా వ్యవస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రస్థాయిలో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు.

స్మార్ట్ రేషన్ కార్డులు Representative Image (image : Gemini AI)
స్మార్ట్ రేషన్ కార్డులు Representative Image (image : Gemini AI)

సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమానికి అనుగుణంగా… ఏకకాలంలో రాష్ట్రంలోని మిగిలిన 33 జిల్లాల కేంద్రాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఒకేసారి స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

ముఖ్యమైన పాయింట్లు :

  1. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 1,06,28,092 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 3,43,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతీ అర్హత కలిగిన లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రభుత్వం సంపూర్ణ ఉచితంగా అందజేస్తోంది.
  2. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పౌర సరఫరాల శాఖను, జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.
  3. ఆగస్టు 15వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 3.35 గంటల మధ్య బహిరంగ సభ సాగుతుంది. అనంతరం సాయంత్రం 3.45 గంటలకు సీఎం సంగారెడ్డి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. వివిధ వర్గాలకు చెందిన నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వేదికపై స్మార్ట్ రేషన్ కార్డులను అందించేలా చర్యలు తీసుకుంటారు.
  4. కార్డుల పంపిణీని ఫెయిర్ ప్రైస్ షాపులు (రేషన్ డీలర్లు) లేదా సంబంధిత విభాగాల ద్వారా నిర్వహించడం వల్ల లబ్ధిదారుల గుర్తింపును పక్కాగా ధ్రువీకరించవచ్చు. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
  5. మిగిలిన జిల్లాల్లో జరిగే కార్యక్రమాల నిర్వహణ కోసం కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపాలని, నిధుల వినియోగంపై ఎలాంటి అయోమయం లేకుండా బడ్జెట్ కేటాయింపులు పూర్తి చేయాలని ఆదేశించారు.
  6. ఉచిత రేషన్ బియ్యం సరఫరా కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. 14,000 కోట్లు వెచ్చిస్తోంది. దీనికి అదనంగా రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం దాదాపు రూ. 20,000 కోట్లు ఖర్చు చేస్తోంది.
  7. గత 2025 జనవరి 26 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 16,32,810 ఆహార భద్రత కార్డులను మంజూరు చేసింది. ఈ కొత్త కార్డుల ద్వారానే అదనంగా 61,08,544 మంది లబ్ధిదారులకు ఉచిత బియ్యం పథకం వర్తిస్తోంది.
  8. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1,06,28,092 కు చేరింది. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ స్మార్ట్ రేషన్ కార్డుల వ్యవస్థ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం, వేగం, సౌలభ్యం మరింత పెరుగుతాయని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More