Crime News : సూర్యాపేట జంట హత్యల కేసు - కానిస్టేబుల్ అరెస్ట్, వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
సూర్యాపేట జిల్లా మోతె గ్రామం వద్ద దంపతులను దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. అప్పు తీర్చకపోగా కేసు పెడతామని బెదిరించడంతో కానిస్టేబుల్ ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు తేలింది.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మోతే గ్రామం సరిహద్దుల్లో సంచలనం సృష్టించిన దంపతుల జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఒక పోలీస్ కానిస్టేబుల్తో పాటు అతని అనుచరుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..?
ఆగస్టు 11వ తేదీ రాత్రి మోతే గ్రామం వెలుపల ఉన్న ఒక వ్యవసాయ పొలంలో సుమారు 40 ఏళ్ల వయస్సున్న భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. మరుసటి రోజు వారి మృతదేహాలు సగం పూడ్చిపెట్టిన స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను వెలికితీసి, దర్యాప్తు ప్రారంభించాయి.
కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించారు. జంట హత్యలు జరిగిన 24 గంటల వ్యవధిలోనే మోతే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని, సూర్యాపేటలోని కొత్త బస్సు స్టాండ్ సమీపంలో విధుల్లో ఉన్న సదరు కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఇద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పత్రికా ప్రకటనలో తెలిపారు.
హత్యకు దారితీసిన కారణాలు….
కుటుంబ తగాదాల విషయమై బాధితులు గతంలో మోతె పోలీస్ స్టేషన్కు తరచూ వచ్చేవారని పోలీసు అధికారుల విచారణలో తేలింది. ఆ సమయంలో తమ అల్లుడు డబ్బు కోసం వేధిస్తున్నాడని, ఆర్థికంగా సహాయం చేయాలని వారు సదరు కానిస్టేబుల్ను కోరారు. దీనితో ఆ కానిస్టేబుల్ వారికి దాదాపు రూ.3 లక్షల వరకు అప్పుగా ఇచ్చాడు. అయితే…. ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించకపోగా, ఆ కానిస్టేబుల్పైనే కేసు పెడతామని సదరు దంపతులు బెదిరింపులకు దిగారు. దీంతో ఆందోళన చెందిన కానిస్టేబుల్ వారిని అంతమొందించాలని పథకం పన్నాడని పోలీస్ అధికారి వెల్లడించారు.
పక్కా పథకం ప్రకారం హత్య…
గొర్రెల పెంపకం రుణం ఇప్పిస్తానని చెప్పి కానిస్టేబుల్ ఆ దంపతులను నమ్మించాడు. రుణం మంజూరు కావాలంటే తనిఖీల కోసం గొర్రెలను చూపించాలని…. అందుకోసం ఊరి బయట నీటి వసతి ఉన్న చోట గొర్రెలను ఉంచాలని చెప్పి వారిని ఒప్పించాడు.
పథకం ప్రకారం… కానిస్టేబుల్, రెండో నిందితుడు కలిసి మొదట భర్తను ద్విచక్రవాహనంపై ఊరి చివర ఉన్న పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అతడితో గుంత తవ్విస్తుండగా, ఉన్నట్టుండి రాతితో తలపై బలంగా బాది హత్య చేశారు. అతడు మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత, ఆ మృతదేహాన్ని తవ్విన గుంతలోనే పూడ్చిపెట్టారు.
ఆ తర్వాత, ఫొటోలు తీయాలనే నెపంతో భార్యను కూడా అదే ప్రదేశానికి రప్పించారు. ఆమెను కూడా దారుణంగా హత్య చేసి, పక్కనే ఉన్న మరో గుంతలో పూడ్చిపెట్టారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

