నిజామాబాద్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ కేసు కేసులో పట్టుబడిన నిందితుడు… 42 ఏళ్ల కానిస్టేబుల్ పై కత్తితో దాడికి దిగాడు. బైక్ పై పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కత్తి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా పరిగణించింది.
బైక్ పై తీసుకెళ్తుండగా కత్తితో దాడి…

పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం… ఈ సంఘటన అక్టోబర్ 17వ తేదీన రాత్రి 08.30 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగింది. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాల కేసులో నిందితుడిగా ఉన్న షేక్ రియాద్ అనే క్రిమినల్ ను అరెస్ట్ చేసి బైక్ పై పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడి… కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితుడు రియాద్ పారిపోయాడు.అప్రమత్తమైన పోలీసులు నిందితుడు షేక్ రియాద్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. రియాద్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి సూచించారు.
కానిస్టేబుల్ మృతి పట్ల డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను ఓదార్చాలని ఐజీకి సూచించారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేయాలన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిసున్నారు. ఈ పరిణామం పోలీస్ శాఖలో సంచలనంగా మారింది.