హైదరాబాద్ లోని మలక్ పేటలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వాహేద్ నగర్లో చోటు చేసుకుంది.
బైక్ పై వెళ్తుండగా….

ప్రాథమిక వివరాల ప్రకారం…. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు ఇటీవలనే హైదరాబాద్ కు వచ్చారు. దిల్సుఖ్నగర్ కొత్తపేటలో నివసిస్తున్న తమ కుమార్తె వద్దకు వచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం సాయంత్రం ట్యాంక్ బండ్ చూసేందుకు వారిద్దరూ బైక్పై బయలుదేరారు. ఈ క్రమంలోనే మలక్ పేట వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి బైక్ ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సీపీ పుటేజీ బయటికొచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్ష కోసం తరిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.
బోల్తా పడిన బస్సు:
మరోవైపు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ వద్ద జరిగింది. మణుగూరు నుంచి పాల్వంచ వెళుతున్న KLR ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సు మొండికుంట అడవి ప్రాంతంలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో సుమారుగా బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.