Ranga Reddy District: ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం - 3 రాష్ట్రాల్లో ఆస్తులు..!

అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా… భారీగా ఆస్తులు బయటపడ్డాయి. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు ప్రకటించారు.

Published on: Dec 05, 2025 9:43 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుండగా… తాజాగా మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసింది. గురువారం నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి.

ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ అరెస్ట్‌
ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ అరెస్ట్‌

6 చోట్ల సోదాలు - భారీగా ఆస్తులు…

తెలంగాణ ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ మరియు భూ రికార్డుల కార్యాలయములో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న కొంతం శ్రీనివాసులుపై అక్రమ ఆస్తులకేసు నమోదైంది. అతనితో పాటు బంధువులకు సంబంధించిన 6 స్థలాలలో సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భుజాలో ఒక ఫ్లాట్, మహబూబ్ నగర్ లో 4 ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో ఒక రైస్ మిల్లుతో పాటుగా 3 ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురములో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు.

1.6 కిలోల బంగారు మరియు 770 గ్రాముల వెండి ఆభరణాల వంటి స్థిర,చరాస్తులతో పాటు ఐదు లక్షల రూపాయల నగదు కలిగి ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ ప్రకటించింది. కేసు దర్యాప్తులో ఉందని పేర్కొంది.

సోదాల్లో అక్రమ ఆస్తులు:

  • మై హోం భుజాలో ఫ్లాట్
  • నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ / రైస్ మిల్
  • కర్ణాటకలో 11 ఎకరాల స్తిరాస్తికి సంబందించిన డాక్యుమెంట్లు
  • ఏపీలోని అనంతపూర్‌లో 11 ఎకరాల స్థిరాస్తి డాక్యుమెంట్లు
  • మహబూబ్ నగర్‌లో 4 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు
  • నారాయణపేటలో మరో 3 ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు
  • 5 లక్షల నగదు
  • 1.6 కిలోల బంగారం
  • 770 గ్రాముల వెండి ఆభరణాలు

ఒకవేళ ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలైన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.