Medaram Jatara : ఎవరీ సమ్మక్క- సారలమ్మ..? మేడారం జాతర చరిత్ర తెలుసా....!
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం పేరొందింది. పచ్చని అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతర కోసం కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ జాతరకు ఉన్న చరిత్ర ఏంటో ఇక్కడ తెలుసుకోండి….
రాష్ట్రంలోని ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్ట ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాల కొకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందింది.

మేడారం జాతర ప్రాశస్త్యం…
అందుబాటులో ఉన్న సమాచారం అనుసరించి…. ఈ జాతర యొక్క ప్రాశస్త్య మేమనగా 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాతంలోని పొలవాసను పాలించే ఆదివాసి దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న ఇద్దరు సంతానం. కాకతీయులకు ప్రతీ సంవత్సరం చెల్లించే కప్పం కట్టలేదన్న కారణంతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తుతాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పోయి అజ్ఞాత వాసం గడుపుతుంటాడు.
మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా వుంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేక పోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ ఆదివాసిల సార్వభౌమునికి వ్యతిరేకంగా తిరుగుబాటు భావాజాలాన్ని నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణాలతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.
సాంప్రదాయ ఆయుధాలు ధరించి పోరాడిన పగిడిద్దరాజు, నమ్మక్క, సారక్క, జంపన్న, గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేసినప్పటికీ సుశిక్షుతులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.
ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్ప తిప్పలు పెడుతుంది. ఆదివాసి మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడు అవుతాడు. చివరికి సమ్మక్కను కాకతీయుల సైన్యం వెనుక వైపు నుండి బరిసెతో పొడుస్తారు. శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెళుతూ మార్గమధ్యములోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల కుంకుమ భరణ లభిస్తుంది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క - సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
సారలమ్మ రాకతో మొదలు…
ఈసారి 2026లో జనవరి 28 నుండి 31 వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది. జాతర మొదటి రోజైన 28-01-2026 నాడు కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకు వస్తారు. అదే రోజు కొండాయి నుండి గోవిందరాజులును, పూనుగుండ్ల నుండి పడిగిద్దరాజులను గద్దెలపై ప్రతిష్టింప చేస్తారు. రెండవ రోజున 29-01-2026 సమ్మక్కను చిలుకల గుట్ట నుండి పూజార్లు తీసుకోని వచ్చి గద్దెపై ప్రతిష్టింప చేస్తారు.
మూడో రోజున శుక్రవారం పూర్తి మొక్కుల చెల్లింపు, నాలుగవ రోజు సాయంత్రం దేవ దేవతలను తిరిగి వన ప్రవేశం చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆదివాసులే పూజార్లు కావడం ఈ జాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించడం ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లము) నైవేద్యంగా సమర్పించుకుంటారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

