కరీంనగర్ : ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు - తప్పిన పెను ప్రమాదం!

Electric RTC Bus Fire Accident : కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం కాగా…. డ్రైవర్ సమయస్ఫూర్తితో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Published on: Jun 21, 2026, 12:01:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Electric RTC Bus Fire Accident : కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా సాంకేతిక లోపంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. అయితే…. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కరీంనగర్ డిపోనకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం 8:00 గంటల ప్రాంతంలో 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సు కరీంనగర్ శివార్లలోని అలుగునూరు దాటిన తర్వాత కాకతీయ కాలువ సమీపంలోకి చేరుకోగానే…. ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు, మంటలు రావడం ప్రారంభమైంది.

బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ ప్రశాంత్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బస్సును రోడ్డు పక్కన సురక్షితమైన ప్రదేశంలో నిలిపివేశారు. వెంటనే బస్సు ప్రధాన ద్వారంతో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (అత్యవసర ద్వారాలు) గేట్లను తెరిచారు. ప్రయాణికులందర్నీ సామాన్లతో సహా హుటాహుటిన కిందకు దిగిపోవాలని గట్టిగా అరిచారు. డ్రైవర్ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రయాణికులు ఒకరినొకరు తోసుకోకుండా వేగంగా బస్సులో నుంచి బయటకు దూకేశారు.

అగ్నికి బూడిదైన బస్సు

ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించిన తర్వాత…. డ్రైవర్, కండక్టర్ బస్సులో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలను (ఫైర్ ఎక్స్‌టింగిషర్స్) ఉపయోగించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే బ్యాటరీ లోపం వల్ల మంటలు తీవ్రరూపం దాల్చాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి దట్టంగా వ్యాపించాయి.

స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో, ఫైర్ సిబ్బంది వాహనంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More