...
...
Next Story

TG EHS : ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అప్డేట్ - హెల్త్ కేర్ ట్రస్టుకు స్వయంప్రతిపత్తి..! ముఖ్య నిర్ణయాలు

Telangana Employee Health Care Trust : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రతిష్టాత్మక 'ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్' రాబోయే రెండు రోజుల్లో ఏర్పాటు కానుంది. ఉన్నత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Published on: Jun 1, 2026, 22:02:30 IST
Advertisement

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం సరికొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అంతా ఒక ప్రత్యేకమైన 'ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్' ద్వారానే అమలు కానుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రకటించారు. రాబోయే రెండు రోజుల్లోనే ఈ ట్రస్ట్‌ను అధికారికంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

సీఎస్ సమీక్ష - హాజరైన ఉద్యోగ సంఘాలు
సీఎస్ సమీక్ష - హాజరైన ఉద్యోగ సంఘాలు

డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో సోమవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఉద్యోగుల ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం, ప్రక్రియను సరళీకృతం చేయడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

పూర్తి స్వయంప్రతిపత్తి.. ప్రత్యేక బ్యాంక్ ఖాతా

ఈ కీలక సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు లేని, అత్యంత నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కొత్త హెల్త్ ట్రస్ట్ అత్యంత పారదర్శకంగా, వేగంగా సేవలను అందించడానికి ఒక బలమైన వ్యవస్థగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.

  • ఈ హెల్త్ కేర్ ట్రస్ట్ పూర్తి స్వయంప్రతిపత్తి అధికారాలతో పనిచేస్తుంది. లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం దీనికి ఉంటుంది.
  • ట్రస్ట్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఒక అంకితమైన బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడం జరుగుతుంది.
  • ఉద్యోగులు అందించే హెల్త్ కాంట్రిబ్యూషన్‌కు సమానంగా (Equal Financial Contribution) ప్రభుత్వం కూడా తన ఆర్థిక వాటాను ఈ ట్రస్ట్ ఖాతాలో జమ చేస్తుంది.

సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ పక్షాన కొన్ని డిమాండ్లతో పాటు సందేహాలను ప్రభుత్వం ముందు ఉంచారు. ఆ వివరాలు ఇవే….

  • భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే, ఒక్కరి జీతం నుంచే సబ్‌స్క్రిప్షన్ మినహాయించాలి.
  • పోలీస్, ఎక్సైజ్ శాఖల్లో ఇప్పటికే వేర్వేరు ఆరోగ్య పథకాలు ఉన్నాయి, మరి వారి నుండి కూడా EHS మినహాయిస్తారా?
  • ఆయుష్ (Ayush) ఆసుపత్రులలో కూడా ఈ పథకం కింద వైద్యం పొందేందుకు అనుమతించాలి.
  • కుటుంబ సభ్యుల పరిగణనలోకి సోదరి మరియు సోదరులను కూడా అనుమతించాలి.
  • భార్యాభర్తలలో ఒకరు ఉద్యోగి, మరొకరు పెన్షనర్ అయినప్పుడు ఎవరి నుండి ప్రీమియం తీసుకుంటారు?
  • ఉద్యోగులకు సంవత్సరానికి ఒకసారి ఉచితంగా హెల్త్ చెకప్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి.
  • అవివాహితులైన సంతానానికి 25 సంవత్సరాలు దాటినప్పటికీ వారిని కూడా పథకంలో కొనసాగించాలి.
  • హెల్త్ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల సభ్యుల సంఖ్యను పెంచుతారా?
  • అత్యవసర సమయాల్లో ఇతర రాష్ట్రాల ఆసుపత్రులలో కూడా చికిత్సకు అనుమతించాలి.
  • సర్వీస్ పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్‌లు ఒక్కరే ఉన్న సందర్భాల్లో ప్రీమియం ఎలా మినహాయిస్తారు?
  • ఈ పథకాన్ని ఏప్రిల్ మాసం నుంచే అమలు చేస్తారా?
  • ప్రీమియం మినహాయించే సమయంలో పే బిల్స్‌లో ఉద్యోగుల మరియు ప్రభుత్వ వాటా కాలమ్‌లు స్పష్టంగా ఉండాలి.
  • ప్రతి నెల మినహాయించబడ్డ ప్రీమియంను వెంటనే ట్రస్ట్ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి.
  • చికిత్సకు అయ్యే ఖర్చు విషయంలో అప్పర్ లిమిట్ ఉందా? ప్యాకేజీల పూర్తి వివరాలు ఏమిటి?
  • సీపీఎస్ (CPS) ఉద్యోగులు రిటైర్ అయిన సందర్భంలో లాస్ట్ బేసిక్ పే మీద ప్రీమియం ఎలా లెక్కిస్తారు?
  • అత్యవసర సమయాల్లో ఎలాంటి ముందస్తు నిబంధనలు లేకుండా ఏ హాస్పిటల్‌లోనైనా చేరేందుకు అనుమతించాలి.
  • కంటింజెన్సీ ఉద్యోగుల విషయంలో జీవోల ప్రకారం EHS ఎలా అమలు చేస్తారు?
  • ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 174, 171, 91, 186, 97, 98 లను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునర్నిర్వచించాలి.
  • మే మాస వేతనంలో భార్యాభర్తలిద్దరి జీతాల నుండి ప్రీమియం మినహాయించినందున, ఆ అదనపు మొత్తాన్ని తిరిగి రెమిట్ (వాపస్) చేస్తారా…?

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks