TGPSC Job Notifications 2026 : నిరుద్యోగులకు శుభవార్త - ఇక వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు, కీలక ప్రకటన

TGPSC Job Notifications 2026 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రేపు 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. కంప్యూటర్ ఆధారిత విధానంలోనే ఈ రిక్రూట్‌మెంట్‌లు జరుగుతాయని టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం వెల్లడించారు.

Published on: Jun 1, 2026, 16:45:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో కొలువుల జాతర మళ్లీ ఊపందుకోనుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రేపు (మంగళవారం) ఒకేసారి మూడు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయబోతోంది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ వెంకటేశం పలు వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేశామని, అందులో భాగంగానే రేపు ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

టీజీపీఎస్సీ
టీజీపీఎస్సీ

ఈ నెలలోనే మరిన్ని నోటిఫికేషన్లు - ఛైర్మన్ వెంకటేశం

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇక్కడితో ఆగదని…. ఈ నెలలోనే అత్యధిక సంఖ్యలో నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేయడానికి కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోందని TGPSC చైర్మన్ వెంకటేశం పేర్కొన్నారు. రేపు విడుదల చేయబోయే 3 నోటిఫికేషన్లలో భాగంగా వివిధ శాఖల్లో ఉన్న 25 సింగిల్ పోస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు, వయోపరిమితి మరియు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల సమాచారాన్ని టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

3,800 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో కొత్త నియామకాలకు సంబంధించి దాదాపు 3,800 ఉద్యోగ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే పూర్తి స్థాయిలో అనుమతులు మంజూరు చేసిందని కమిషన్ చైర్మన్ వివరించారు. ఆర్థిక శాఖ అనుమతి లభించిన పోస్టులన్నింటికీ త్వరలోనే వరుసగా నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ముఖ్యంగా అటవీ శాఖలోఖాళీగా ఉన్న 3,093 పోస్టులను పెద్ద ఎత్తున భర్తీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

భవిష్యత్తులో కమిషన్ నిర్వహించబోయే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలన్నీ పారదర్శకంగా, లీకేజీలకు తావులేకుండా ఉండేందుకు కంప్యూటర్ (ఆన్‌లైన్) విధానంలోనే నిర్వహిస్తామని చైర్మన్ వెంకటేశం స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామన్నారు.

ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువస్తున్నట్లు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. కమిషన్ పరిధిలోని అన్ని రకాల ఉద్యోగ పరీక్షలను రాబోయే రోజుల్లో పూర్తిగా ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలోనే నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఆన్‌లైన్ విధానం వల్ల పేపర్ లీకేజీలకు అస్సలు అవకాశం ఉండదన్నారు. వీలైతే అభ్యర్థులు కంప్యూటర్ ముందు పరీక్ష పూర్తి చేసి సబ్మిట్ చేసిన వెంటనే.. తాము ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశారో (స్కోర్) కూడా అక్కడికక్కడే తెలిసిపోయేలా సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More