తెలంగాణ కేబినెట్ విస్తరణ : ఆ ఇద్దరికి నామినేటెడ్ పదవులు - మారుతున్న సమీకరణాలు....!
తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా అజారుద్దీన్ కు అవకాశం కూడా దక్కింది. మరో 2 ఖాళీలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఇద్దరు సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు ఖరారయ్యాయి. దీంతో అధికార కాంగ్రెస్ లో సమీకరణాలు మారుపోతున్న పరిస్థితులు ఉన్నాయి.
మంత్రివర్గ విస్తరణ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా మైనార్టీ కోటా నుంచి అజారుద్దీన్ కు అవకాశం రాగా.... మిగిలిన మరో 2 బెర్తులపై చాలా మంది నేతలు కన్నేశారు. జిల్లాల వారీగా పెద్ద లిస్టే ఉంది. ఇందులో కొన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి తప్పనిసరిగా కేబినెట్ లో అవకాశం ఉంటుందన్న చర్చ ఎప్పట్నుంచో ఉంది. సీన్ కట్ చేస్తే.... మంత్రి పదవులు ఆశిస్తున్న ఇద్దరు సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో మంత్రి పదవుల విషయంలో సమీకరణాలు మారుపోతున్న పరిస్థితులు ఉన్నాయి.

నామినేటెడ్ పదవులు...!
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావును సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించారు. ఇద్దరినీ కేబినెట్ హోదాలో నియమిస్తూ ఉతర్వులు జారీ అయ్యాయి. అంతేకాదు సుదర్శన్రెడ్డి మాత్రం అన్ని మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది.
నిజానికి ఈ ఇద్దరు నేతలు మంత్రి పదవుల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్నుంచి వీరికి అవకాశం దక్కుతుందన్న ప్రచారం కూడా ఉంది. పైగా నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు కేబినెట్ లో ఎవరూ కూడా లేదు. దీంతో సీనియర్ నేతగా పేరొందిన సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. ఇక పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ప్రేమ్ సాగర్ రావుకు కూడా ఖరారవుతుందనుకున్నారు. విస్తరణలోనైనా ఛాన్స్ ఇస్తారన్న విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ అనూహ్యంగా వీరిద్దరికి నామినేటెడ్ పదవులు ఖరారు కావటంతో.... కేబినెట్ రేస్ నుంచి తప్పుకున్నట్లేనా అన్న చర్చ మొదలైంది...!
అజారుద్దీన్ ప్రమాణస్వీకారంతో కేబినెట్ లో మరో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పటికే పలువురు నేతలకు(నామినేటెడ్) కేబినెట్ హాదా ఇవ్వటంతో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఉందా లేదా అన్న ఆసక్తికరంగా మారింది. కేబినెట్ లో మంత్రులతో పాటు ఆహ్వానితులుగా ఉన్న వారితో కలిసి గరిష్ఠ సంఖ్యకు చేరినందున మళ్లీ విస్తరణ ఉంటుందా లేదా అనేది తేలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం విస్తరణ ఉండకపోవచ్చన చర్చ వినిపిస్తోంది...!
మంత్రివర్గంలో స్థానం కోసం చాలా మంది నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం, పరిగి ఎమ్మెల్యేలు కూడా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరే కాకుండా గిరిజన(లంబాడీ) సామాజికవర్గానికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. వీరే కాకుండా మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు..! మొత్తంగా చూస్తే… తాజా పరిణామాలతో మంత్రి పదవుల విషయంలో అధికార కాంగ్రెస్ లో సమీకరణాలు మారుపోతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి….!
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

