మేడారం జాతరలో ప్రతిదీ చాలా కాస్ట్‌లీ.. భక్తులకు అధిక ధరకు అమ్ముతున్న వ్యాపారులు!

మేడారం జాతరలో ప్రతిదీ చాలా కాస్ట్‌లీగా ఉన్నాయి. ఎందుకంటే వ్యాపారులు అధిక ధరలకు భక్తులకు అమ్ముతున్నారు. చేసేదేమీలేక భక్తుల కొనాల్సిన పరిస్థితి ఉంది.

Updated on: Jan 29, 2026, 07:27:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మెుదలైంది. మహా జాతర ఊపందుకుంటున్న సమయంలో భక్తుల దగ్గర వ్యాపారులు దోచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. భారీ రద్దీని ఆసరాగా చేసుకుని స్థానిక విక్రేతలు, సీజనల్ వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారు. భక్తులు అవసరాల కోసం అధిక ధరలు చెల్లించడం తప్ప వేరే మార్గం లేకుండా పోతోంది.

మేడారం జాతర
మేడారం జాతర

పూజా సామాగ్రి, ఆహార పదార్థాల ధరలు అనూహ్యంగా పెంచేశారు. సాధారణంగా తక్కువ ధరకు లభించే బంగారం(బెల్లం) ఇప్పుడు కిలోకు రూ. 100 వరకు అమ్ముతున్నారు కొందరు. లీటరు వాటర్ బాటిల్ ధర ఏకంగా రూ. 30కి అమ్ముడవుతున్నాయి. దీని ఎంఆర్‌పీ రూ.20 మాత్రమే. అంటే పది రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

యువత బైక్ టాక్సీ సేవలను కూడా ప్రవేశపెట్టారు. మేడారం ప్రాంతంలో ఎక్కడకు వెళ్లినా.. రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. చలి వాతావరణం చాలా మందికి అసౌకర్యంగా ఉండటంతో జంపన్న వాగులో స్థానికులు నది ఒడ్డున కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేశారు. రూ.50కి వేడి నీటిని బకెట్లలో అమ్ముతున్నారు. ఇది లాభదాయకమైన వ్యాపారంగా మారింది. చిన్న పిల్లలకు ఈ వేడి నీరు కొని స్నానాలు చేయిస్తున్నారు.

చెట్ల నీడను కూడా అమ్ముకుంటున్నట్టుగా ఇప్పటికే HT Telugu ఆర్టికల్ పబ్లిష్ చేసింది. భారీగా భక్తులు వస్తుండటంతో విశ్రాంతి తీసుకోవడానికి శుభ్రమైన, నీడ ఉన్న ప్రదేశాలకు డిమాండ్ పెరిగింది. వచ్చేవారు ఆ చెట్ల కింద వంట చేసుకుంటున్నారు. స్థానికులు చెట్లను అద్దెకు ఇస్తున్నారు. కొన్ని గంటలు లేదా రోజు లెక్కన ఇవి ఉంటాయి. రూ. 500 నుండి రూ. 1,000 వరకు వసూలు చేస్తున్నారు.

స్థలాల అద్దెలలో కూడా అధిక ధరలు ఉన్నాయి. గతంలో రూ.3,500 నుండి రూ.4,000 వరకు ఖర్చయ్యే ఒక చదరపు గజ దుకాణ స్థలం ఇప్పుడు రూ.8,000 నుండి రూ.10,000 వరకు పెరిగింది. దీంతో వ్యాపారులు ఇలా చేయాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు.

ఇక మేడారం జాతరలో మాంసం ధరలు మరింత పెరిగాయి. మేడారం, చుట్టుపక్కల ప్రాంతాల్లో మటన్ కిలోకు రూ.1,200 కు అమ్ముడవుతోంది. బోన్‌లెస్ అయితే రూ.1,400 వరకు ధర పలుకుతున్నాయి. చికెన్ ధరలు కిలోకు రూ.400 దాటాయి. డిమాండ్ పెరగడం, కోళ్ల సరఫరాలో తాత్కాలిక తగ్గుదల దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

ఈ పెరుగుదలపై భక్తులు అసంతృప్తితో ఉన్నారు. మొదటిసారి వచ్చే భక్తులు అధిక ఛార్జీలు పడకుండా ఉండటానికి స్వంత ఆహారం, పూజ సామగ్రి, నీటిని తీసుకెళ్లాలని పలువురు చెబుతున్నారు. లేదంటే మేడారం వెళ్లే మార్గంలో పట్టణాల నుండి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More