గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య మృతి - నిందితులపై కఠిన చర్యలకు సీఎం రేవంత్ ఆదేశాలు
గంజాయి స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు. ఆమె మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిజామాబాద్లో గంజాయి స్మగ్లర్లను పట్టుకునే ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సౌమ్య.. శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు నిమ్స్ వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె మృతిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పోలీస్ శాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జనవరి 23న ఘటన….
జనవరి 23వ తేదీన నిజామాబాద్ నగర శివారులో గంజాయి ముఠా హల్చల్ చేసింది. అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత వైద్య చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. అయితే ఈ ఘటన అనంతరం పోలీసులు స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి - సీఎం రేవంత్
సౌమ్య మృతితో ఆమె స్వగ్రామం మోస్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇవాళ సాయంత్రానికి సౌమ్య మృతదేహం స్వగ్రామానికి చేరనుంది. ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులన ఆదేశించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కారణమైన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సౌమ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నీ ధైర్యానికి సెల్యూట్ తల్లి - సీపీ సజ్జనార్
నీ ధైర్యానికి మరణం లేదు తల్లీ! మత్తు రక్కసిని అడ్డుకునేందుకు..మృత్యువునే ఎదిరించిన మేలిమి ధైర్యం నీది! రక్తమోడుతున్నా విధిని వీడని..నిరుపమాన 'త్యాగం' నీది! సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని నీ ధైర్యానికి సెల్యూట్ తల్లీ! అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్తే.. కనికరం లేకుండా వాహనంతో తొక్కించి చంపేశారంటే, డ్రగ్ మాఫియా ఎంతలా పేట్రేగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. మాదక ద్రవ్యాల ముప్పు ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. సౌమ్య మరణం కేవలం ఒక విషాదం మాత్రమే కాదు.. సమాజానికి ఒక హెచ్చరిక. గంజాయి రక్కసిపై పోరాడి.. విధి నిర్వహణలో వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు ఘన నివాళి" అని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ సంతాపం ప్రకటించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

