హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఫేక్ ఎస్ ఓటీ పోలీసుల పేరుతో డబ్బులను డిమాండ్ చేశారు. అపార్ట్ మెంట్ లోకి చొరబడి… రూ.3 కోట్లు ఇవ్వాలని ఓ వ్యక్తిని బెదిరించారు. బెట్టింగ్ యాప్ లను నడుపుతున్నావని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాది మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఫిర్యాదులోని వివరాల ప్రకారం…. నర్సింహరాజుతో సహా ఐదుగురు వ్యక్తులు అపార్ట్ మెంట్ వద్దకు వచ్చారు. మాదాపూర్ ఎస్ఓటి సిబ్బందిగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అక్రమంగా బెట్టింగ్ యాప్స్ ను ఆపరేట్ చేస్తున్నాడని బెదిరించి… రూ.3 కోట్లు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ధృవీకరించిన పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ…. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను గుర్తించామని చెప్పారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టామని వివరించారు.
అంతేకాకుండా ఫిర్యాదుదారుడు స్వయంగా బెట్టింగ్ యాప్స్ ఆపరేషన్లలో పాల్గొన్నట్లు కూడా గుర్తించామని చెప్పారు. అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కూకట్ పల్లి పోలీసులు పేర్కొన్నారు.
నిందితులు ఐదుగురు కాగా… వీరిలో నరసింహ రాజు, రవీంద్రబాబు అనే ఇద్దరు అరెస్ట్ అయినట్లు తెలిసింది. ఫ్లాట్ లోకి చొరబడ్డ మిగతా దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.