కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ వద్ద ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) కి చెందిన సైట్ కార్యాలయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆఫీసు క్యాబిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

దట్టమైన ప
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కార్యాలయం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే…. అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చడంతో కార్యాలయం లోపల ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లతో పాటు కీలక సామాగ్రి అంతా కాలిపోయింది.
ఈ అగ్నిప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి, దానికి సంబంధించిన డిజైన్లు, నిర్వహణ, వ్యయ ప్రణాళికలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు విశ్వసనీయ సమాచారం. గత కొంతకాలంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మరియు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీలు దర్యాప్తు జరుపుతున్న తరుణంలో.. ఈ అగ్నిప్రమాదం జరగడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.