హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం సాయంత్రం జరిగిన ఈ కాల్పుల్లో ఓ గోరక్షకుడికి పేరొందిన సోనుసింగ్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఘట్కేసర్ సమీపంలో ఆవుల అక్రమ రవాణాను అడ్డుకున్న సోనుసింగ్(ప్రశాంత్) పై కాల్పులు జరిగాయని తెలంగాణ బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రాథమిక వివరాల ప్రకారం…. ఇబ్రహీం అనే వ్యక్తి గోవులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తాడు. ఈ విషయంలో ఇబ్రహీం, సోనూ మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిసింది. గత నెలలో గోవులను తరలిస్తున్న కంటైనర్ను సోనూ వెంబడించాడు. ఈ విషయంలోనే ఇబ్రహీం… సోనూపై కోపంతో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య తాజాగా వాగ్వాదం చోటు చేసుంది. దీంతో తన వెంట తెచ్చుకున్న తుపాకీతో సోనూపై ఇబ్రహీం కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సోనూను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనునూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తదితరులు పరామర్శించారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.