...
...
Next Story

ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హైదరాబాద్‌లో కొత్తగా ఆరు లేన్ల ఫ్లైఓవర్, రెండు అండర్‌పాస్‌లు!

భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ కీలక అడుగు వేసింది. ఆరు లేన్ల ఫ్లైఓవర్, రెండు అండర్‌పాస్‌లను నిర్మించడానికి చర్యలు తీసుకుంది.

Published on: Nov 06, 2025 12:11 PM IST
Advertisement

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కీలక ప్రాజెక్టు చేపట్టింది. మియాపూర్ ఎక్స్ రోడ్ నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు ఆరు లేన్ల డబుల్ సైడ్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించింది. హఫీజ్‌పేట్ నుండి మియాపూర్ వరకు ఒకటి, బాచుపల్లి నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు మరో రెండు మూడు లేన్ల అండర్‌పాస్‌లను నిర్మించే ప్రక్రియను కూడా జీహెచ్‌ఎంసీ మెుదలుపెట్టింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ ప్రాజెక్ట్ ఐటీ కారిడార్లు, గచ్చిబౌలి, మియాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలక ప్రాంతాల మధ్య ట్రాఫిక్ సమస్యను చాలా వరకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. మియాపూర్-ఆల్విన్ మధ్య అత్యంత ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. పెరుగుతున్న జనాభా, పనులకు వెళ్లేవారితో ఈ సమస్య అవుతుంది

ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.530 కోట్లు, ఈ ప్రాజెక్టును హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ప్రాజెక్ట్ కింద చేపట్టనున్నారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ వ్యవస్థ కింద సర్వేలు, డిజైన్, వివరణాత్మక ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ అమలు కోసం జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలను ఆహ్వానించింది. టెండర్లు సమర్పించేందుకు చివరి తేదీ నవంబర్ 20, సాంకేతిక బిడ్లు అదే రోజు ఓపెన్ అవుతాయి. ధర బిడ్లు నవంబర్ 24వ తేదీన తెరవనున్నారు.

ఎంపికైన కాంట్రాక్టర్ రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఈ సమయంలో ప్రాజెక్టులో లోపాలు వస్తే వాటిని సరిచేసే బాధ్యత కూడా వారిదే.

25 మీటర్ల వెడల్పు గల ఈ ఫ్లైఓవర్‌కు ఇరువైపులా 0.5 మీటర్ల క్రాష్ బారియర్లు, ఒక మీటర్ సెంట్రల్ మీడియన్, రెండు వైపులా 11.5 మీటర్ల క్యారేజ్‌వే ఉంటాయి. ఇక హఫీజ్‌పేట్ నుండి మియాపూర్ వరకు మూడు లేన్ల అండర్‌పాస్ 13.9 మీటర్ల వెడల్పు ఉంటుంది, 11 మీటర్ల క్యారేజ్‌వే, సైడ్ ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్‌లు, అండర్‌పాస్ బాక్స్, ఆర్‌సీసీ రిటైనింగ్ వాల్ అప్రోచ్‌లు, డ్రైనేజీ డిస్పోజల్ అమరికతో రెండు లక్షల లీటర్ల సామర్థ్యం గల భూగర్భ సమ్ప్ కూడా ఏర్పాటు చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe