తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్.. మీసేవ ద్వారా దరఖాస్తు.. ఇది ఎందుకు?

Telangana Family Register Certificate : తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయనుంది. రేషన్ కార్డుల ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్‌ను జారీ చేయనుంది.

Published on: Jul 27, 2026, 22:22:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసేందుకు, కుటుంబ సమగ్ర వివరాల ధ్రువీకరణను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ పరిధిలో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికేట్‌ను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్
తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్

ఈ నూతన విధానం ద్వారా పౌరులు తమ కుటుంబ వివరాలతో కూడిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్‌ను మీసేవ కేంద్రాల ద్వారా పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ రూపంలో కుటుంబాల వివరాలను నిర్వహిస్తారు.

సివిల్ సప్లైస్ శాఖ నిర్వహిస్తున్న ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ (రేషన్ కార్డ్) డేటాబేస్ నుంచే కుటుంబ సభ్యుల వివరాలను నేరుగా సేకరిస్తారు. రేషన్ కార్డ్ నంబరే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా ఉంటుంది.

ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికేట్‌లో ఉండే వివరాలు చూసుకుంటే.. ఫ్యామిలీ రిజిస్టర్ ఐడీ (రేషన్ కార్డ్ నంబర్), యజమాని (Head of the Family) పేరు, కుటుంబ సభ్యుల పేర్లు-యజమానితో ఉన్న సంబంధం, ప్రతి సభ్యుడి వయస్సు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ నంబర్ ఉంటాయి. అంతేకాదు ప్రస్తుత చిరునామా (డోర్ నంబర్, వీధి, గ్రామం/వార్డు, పంచాయతీ/మున్సిపాలిటీ, మండలం, జిల్లా) కూడా అందులో ఉండనున్నాయి.

పౌరులు మీసేవ కేంద్రాలు, మీసేవ ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్యామిలీ రిజిస్టర్‌లో పేరు నమోదై ఉన్న కుటుంబ సభ్యులలో మేజర్ (18 ఏళ్లు పైబడిన వారు) మాత్రమే ఈ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి కేవలం రెండు పని దినాలలో సర్టిఫికేట్ జారీ చేస్తారు.

మీసేవలో సమర్పించిన దరఖాస్తు సంబంధిత మండల తహశీల్దార్ లాగిన్‌కు ఆటోమేటిక్‌గా వెళ్తుంది. తహశీల్దార్ రేషన్ కార్డ్ డేటాతో వివరాలను సరిచూసుకుని, అంతా సరిగ్గా ఉంటే డిజిటల్ సంతకం ద్వారా సర్టిఫికేట్‌ను ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ప్రత్యేక సర్టిఫికేట్ నంబర్‌తో కూడిన పత్రాన్ని మీసేవ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జీవోలో ప్రభుత్వం ఒక ముఖ్యమైన స్పష్టతనిచ్చింది. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కేవలం సివిల్ సప్లైస్ డేటాబేస్ ఆధారంగా కుటుంబ నిర్మాణం తెలిపే ఒక రికార్డు మాత్రమే. ఇది ఆస్తి హక్కులు, చట్టపరమైన వారసత్వ హక్కులు లేదా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల క్లెయిమ్‌లకు నేరుగా ఎలాంటి చట్టపరమైన హక్కును కల్పించదని స్పష్టం చేశారు.

ఈ సేవను వేగవంతంగా అమల్లోకి తీసుకురావడానికి ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్, సివిల్ సప్లైస్ కమిషనర్‌లు సాంకేతిక సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు అందరూ తమ పరిధిలోని రెవెన్యూ అధికారులకు ఈ సూచనలను తగిన విధంగా చేరవేసి, సేవలు వేగంగా అందేలా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More