హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… మరికొందరు గాయపడ్డారు.
కంటైనర్ను ఢీకొట్టడంతో….
ప్రాథమిక వివరాల ప్రకారం… ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు వైపు వెళ్తుండగా దొరకుంట సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగం కంటైనర్ను ఢీకొట్టడంతో తీవ్రంగా ధ్వంసమైంది. సీట్లలో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒకేసారి చెల్లాచెదురుగా పడిపోయారు.
ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురు పురుషులున్నారు. మృతదేహాలు బస్సు శిధిలాల్లో చిక్కుకుపోవడంతో స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించగా… పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు.